ఆలూ లేదు.. చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నాడట వెనకటికి ఎవడో. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ వర్గాల నుంచి వస్తోన్న లీకులు కూడా అలాగే వున్నాయి మరి. గతంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణను బీజేపీ సీఎం అభ్యర్థిగా ఇలానే ప్రచారంలోకి తీసుకొచ్చారు. అయితే, ఆయన బీజేపీలోకి వెళ్ళకుండా జనసేన పార్టీలో చేరారు. అయితే, వీవీ లక్ష్మినారాయణను బీజేపీలోకి రప్పించేందుకు చాలా ప్రయత్నాలు చేసి, అవి కుదరకపోవడంతో చివరికి కన్నా లక్ష్మినారాయణతో సరిపెట్టుకున్నారు.
తాజా ఎన్నికల్లో బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఘోరంగా దెబ్బతింది. కనీస ఓటు బ్యాంకు కూడా లేకుండా పోయింది ఆ పార్టీకి. అయినాగానీ, తగుదునమ్మా.. అంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చిచ్చు పెడుతున్నారు కమలనాథులు. ఇప్పటికే నలుగురు టీడీపీరాజ్యసభ సభ్యుల్ని లాగేసిన బీజేపీ, మరికొందరు టీడీపీ ముఖ్య నేతల్ని లాగేసి ఆంధ్రప్రదేశ్లో బలపడాలని ప్రయత్నిస్తున్నారు. బీజేపీలోకి వెళ్ళిన సుజనా చౌదరి, సీఎం రమేష్ తదితరులు జన బలం లేని నేతలన్నది జగమెరిగిన సత్యం. అయినాగానీ, టీడీపీని మానసికంగా దెబ్బకొట్టడానికి ఇదొక వ్యూహం.
మరోపక్క, అసెంబ్లీలో ఇప్పుడు టీడీపీకి వున్న బలంలో మూడింట రెండొంతుల మందిని లాగేద్దామనే ఆలోచనలో వుంది బీజేపీ అధిష్టానం. ఆ లెక్కన గంటా శ్రీనివాసరావు కూడా బీజేపీలోకి వెళతారట. అధికారం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళడంలో సిద్దహస్తుడైన గంటా శ్రీనివాసరావు వెళితే గిలితే వైఎస్సార్సీపీలోకి వెళతారుగానీ, బీజేపీలోకి వెళతారా.? ఏమో, బీజేపీ స్కెచ్ ఎలా వుందో చెప్పలేం. బీజేపీలోకి గంటా శ్రీనివాసరావు వెళ్ళడమంటూ ఖాయమైనా, ఆయన ముఖ్యమంత్రి అవనుండడంపై బీజేపీ సానుకూలంగా వున్నా.. అదంతా జరిగేందుకు చాలా టైమ్ పడుతుంది.
అవన్నీ జరగాలంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలి, బీజేపీ అధికారంలోకి రావాలి. అది జరిగే పని కాదు. సో, గంటా శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవుతారన్న గాసిప్లో ఏ మాత్రం వాస్తవం లేదు. కానీ, ఆయన బీజేపీలోకి వెళ్ళేందుకు అవకాశాలైతే స్పష్టంగా వున్నాయి. కాంగ్రెస్సే నయ్యం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ని పార్లమెంటు సాక్షిగా విభజించింది. బీజేపీ మరీ దారుణంగా, ఆంధ్రప్రదేశ్లో నీఛ రాజకీయాలు చేస్తోందని జనం అభిప్రాయపడుతున్నారు.
