ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ప్రస్తుతానికి ‘కంట్రోల్’లోనే వుందని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పనిచేస్తోందని అధికార పార్టీ నేతలు చెప్పడం మామూలే. మంత్రులు పబ్లిసిటీ స్టంట్లు చేయడం.. ఇతర వైసీపీ నేతలు విచ్చలవిడిగా రోడ్లెక్కి హల్చల్చేయడం చూస్తూనే వున్నాం.
సోషల్ డిస్టెన్స్కి సంబంధించిన నిబంధనలు కేవలం ఇతరులకు మాత్రమేననీ, అధికార పార్టీ నేతలకు అవి వర్తించవన్నట్లు వుంది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. కేసుల తీవ్రత తగ్గుతోందనీ, జోన్ల వారీగా పరిస్థితిని విభజించి, గ్రీన్ జోన్లో ఆంక్షలు సడలించాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజ్ఞప్తి చేయడం విమర్శలకు తావిచ్చింది. ప్రధాని ఈ రోజు ‘లాక్డౌన్’పై స్పష్టత ఇచ్చారు. మే 3 వరకూ లాక్డౌన్ కొనసాగుతుందని తేల్చి చెప్పారు.అయితే, రేపు విడుదలయ్యే మార్గదర్శకాలు ఎలా వుంటాయన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఈ రోజు 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం అందర్నీ విస్మయానికి గురిచేసింది. తాజా కేసుల నమోదుతో, గుంటూరులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య సెంచరీ దాటేసింది. మరోపక్క, కర్నూలు జిల్లాలోనూ కేసుల సంఖ్య సెంచరీకి దగ్గరలో వుంది. సాయంత్రానికి మళ్ళీ కొత్తగా కేసులు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు.
పొరుగు రాష్ట్రం తెలంగాణతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తక్కువగానే వున్నా.. తెలంగాణతో, ఆంధ్రప్రదేశ్ని పోల్చి చూడలేం. మరో పొరుగు రాష్ట్రం కర్నాటక, ఆంధ్రప్రదేశ్ కంటే చాలా మెరుగైన స్థితిలో వుంది. ఇంకో పొరుగు రాష్ట్రం తమిళనాడు మాత్రం, దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రాల లిస్ట్లో మూడో స్థానంలో వుండడం గమనార్హం.
ఏదిఏమైనా, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి కొంత గందరగోళంగానే వుంది. ‘ఏమీ లేదు.. ఆల్ ఈజ్ వెల్..’ అన్నట్లు అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తుండడంతో, జనంలోనూ కొంత నిర్లిప్తత కన్పిస్తోంది. ఆ నిర్లిప్తతే కేసుల పెరుగుదలకు కారణమన్న వాదనలూ లేకపోలేదు.
802674 333290TeenVogue? Searching for fashion advice, celebrity buzz or beauty trends? Locate it all in Teen Vogue 879855