Chinna Jeeyar Swamy: ప్రభాస్ నటించిన ‘ఆది పురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ తిరుపతి వేదికగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిన జీయర్ స్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
‘భగవత్ ప్రియ బంధువుల్లారా.. నమస్కారం. సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన మహనీయులు ఉండే ఇలాంటి వేదికపై మాలాంటి వాళ్ళు రావడం ఇదే తొలిసారి. నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ప్రపంచానికి నిజమైన బాహుబలి రాముడే. ప్రతి ఒక్కరి గుండెల్లోనూ శ్రీరాముడు ఉంటాడు. ప్రభాస్ తనలోని రామున్ని ఈ సినిమా ద్వారా బయటికి తీసుకొస్తున్నాడు. మానవజాతికి మార్గదర్శాన్ని చూపిస్తున్న మహనీయుడు శ్రీరామచంద్రుడే. ఈ నేలపై నడిచి పావనం చేసింది శ్రీరాముడే. చాలామంది ఆయన్ని దేవుడుగా కొలుస్తారు. సాక్షాత్తు దేవతలే ఆయన్ని ‘రామా నువ్వు సాక్షాత్తు నారాయణడివయ్యా’ అని కీర్తించారు. రాముడు మాత్రం తనని మానవుడిగానే చెప్పుకున్నాడు. ఆయన అవతారం ఎత్తకముందు విష్ణువు. అవతారం చాలించిన తర్వాత విష్ణువే. ఆ మధ్యకాలంలో ఆయన మానవుడుగానే ప్రవర్తించాడు. మానవజాతికి ఓ మార్గాన్ని చూపాడు. మనిషి మనిషిగా ఉంటే అతడికి శత్రువులే ఉండరు. అలా రామున్ని కూడా మనుషులు, జంతువులు, పక్షులు, చెట్లు ప్రేమించాయి. ఆఖరికి ముక్కు, చెవులు కోసిన సూర్పనఖ కూడా శ్రీరాముని తేజవంతుడని కీర్తించింది.
ఇప్పుడు తనలో ఉన్న శ్రీరాముని బయటకు తీస్తున్నాడు ప్రభాస్. రామాయణంలోని అరణ్యకాండ, యుద్ధకాండ లోని ప్రధాన అంశాలను తీసుకొని లోకానికి చాటి చెప్పాలనుకుంటున్నామని నాతో అన్నారు. ఇంతకంటే మహోపకారం ఉండదని అనుకుంటున్నా. ఈ తరానికి రాముడు లాంటి వ్యక్తి కావాలి. ఇలాంటి సత్కార్యాన్ని తలపెట్టిన ప్రభాస్, ఓం రౌత్ లకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందాలని కోరుకుంటున్నా. ఇటువంటి సినిమాలు మరెన్నో రావాలి. ఈ సినిమాని ప్రేక్షకులకి అందిస్తున్న చిత్ర బృందానికి నా దీవెనలతో పాటు ప్రేక్షకుల దీవెనలు కూడా అందాలి. మీరందరూ ఆదరిస్తే అది లోకానికి చేరుతుంది’ అని చిన జీయర్ స్వామి అన్నారు.