‘నా వెనక ఎవరూ లేరు. నాకు మీడియా లేదు. నాకు డబ్బులు లేవు.. సింహం సింగిల్గానే వస్తుంది..’ ఇదీ పదే పదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెప్పే మాట.
కానీ, సొంత పార్టీకి చెందిన కార్యకర్తలకు ‘వాలంటీర్’ పోస్టులు ఇప్పించుకుని, వారితో పార్టీ తరఫున ప్రచారం చేసుకుంటుంటారు. సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులపై బూతులు తిట్టడం కోసం పెద్ద సైన్యాన్నే ఏర్పాటు చేసుకుంటారు. ప్రభుత్వ పథకాలకు ప్రచారం పేరుతో మీడియా సంస్థల్ని గుప్పిట్లో పెట్టుకుంటారు.. ఇంకా ఇంకా చాలా చేస్తారు.
ఇంతా చేసినా, ‘వై నాట్ 175’ అని పైకి గట్టిగా చెప్పుకుంటున్నా, లోపల ఏదో భయం.. 2024 ఎన్నికల్లో వైసీపీ తుడిచి పెట్టుకుపోతుందేమోనన్న ఆందోళన.! ఈ నేపథ్యంలోనే, అస్త్ర శస్త్రాలకు పదును పెడుతున్నారు. పార్టీకి చెందిన వివిధ విభాగాల్ని మరింత యాక్టివ్ చేస్తున్నారు వైసీపీ అధినేత.
ఓ వైపు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవ రెడ్డి, వైసీపీ సానుభూతిపరులైన సోషల్ మీడియా యాక్టివిస్టులతో ‘ఆత్మీయ సమావేశాలు’ నిర్వహిస్తున్నారు. ఇంకోపక్క, ‘ఐటీ సైన్యం’ అంటూ లక్ష మందితో కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేయబోతున్నారట.
లక్ష మంది ఐటీ సైన్యమా.? ఇదేంటబ్బా.? చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది ఈ ప్రస్తావన. ఐటీ రంగంలో వున్నారు అంటే.. అంటే, విద్యాధికులని అర్థం. నిజంగానే విద్యాధికులైతే, రాష్ట్రానికి రాజధాని వుందో లేదో తెలియకుండా వుంటుందా.? తెలిస్తే, అసలు వైసీపీకి సపోర్ట్ చేస్తారా.?
రాజులు, రాజ్యాలు ఎప్పుడో పోయాయ్.. కానీ, రాచరిక పోకడలు మాత్రం పోవడంలేదు.!