ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా అది కూడా సరికొత్తగా మారుతున్నాయి. గోదావరి వరదల నేపథ్యంలో కేంద్రం మీద సున్నితమైన విమర్శలు చేసేశారు వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇంకోపక్క, దేశంలో అప్పులు, ఆర్థిక పరిస్థితుల గురించి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేశారు.
చాలా చిత్రమైన పరిస్థితే ఇది. ఇంతకు ముందెన్నడూ ఇంతలా బీజేపీ మీద వైసీపీ ‘ఎటాక్’ చేసింది లేదు. ‘కుక్కిన పేనులా’ బీజేపీ విషయంలో వైసీపీ వ్యవహరించిందన్నది ఓపెన్ సీక్రెట్. బీజేపీతో ఎంత సఖ్యతగా వున్నా రాజకీయంగా తమకు, అలాగే రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదనే నిర్ణయానికి వైసీపీ వచ్చేసిందేమో.!
అన్నిటికీ మించి, బీజేపీ అధిష్టానంతో సయోధ్యకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తున్న దరిమిలా, దాన్ని నివారించేందుకు వైసీపీ ఢిల్లీ స్థాయిలో చేసిన ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయన్న అసహనం బహుశా వైసీపీ నేతల్లో పెరుగుతుండొచ్చు. సరే, చంద్రబాబు ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి.? అన్నది వేరే చర్చ.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ మధ్య ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వను..’ అని వ్యాఖ్యానిస్తే, దానిపై చాలా రకాలుగా పెడార్థాలు తీశారు. కానీ, ఇప్పుడు ఆ దిశగానే రాష్ట్రంలో ప్రజలూ, ఇతర విపక్షాలూ, అందునా ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది.
జనసేన పార్టీని ఏ వంక పెట్టుకుని విమర్శించాలో అర్థంకాక, ఇంకా ‘పాడిందే పాటరా పాచి పళ్ళ డాష్ డాష్..’ అన్నట్టు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద విమర్శలు చేస్తూ, అధికార వైసీపీ తన స్థాయిని తానే మరింత దిగజార్చుకుంటున్న వైనాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు.
ఇదిలా వుంటే, ‘పవన్ కళ్యాణ్ మాత్రమే మా రెండు పార్టీల ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి..’ అని బీజేపీ గతంలోనే ప్రకటించింది. అదే మాటకు ఆ పార్టీ ఇప్పటికీ కట్టుబడి వున్న విషయాన్ని తెలుగుదేశం పార్టీకి ఢిల్లీ బీజేపీ పెద్దలు కూడా స్పష్టం చేశారన్న ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తేనే, టీడీపీతో పొత్తుకు యోచన చేస్తామని బీజేపీ అంటోందిట.
ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ ముందు మరో ఆప్షన్ కూడా లేనట్టే.! దాంతో, చంద్రబాబు సైతం, పవన్ కళ్యాణ్కి జైకొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ, తిమ్మిని బమ్మిని చేయడంలో నేర్పరి అయిన చంద్రబాబు, చివరి నిమిషంలో ప్లేటు ఫిరాయిస్తారా.? అంటే, ఆ అనుమానం బీజేపీలో ఖచ్చితంగా వుంటుంది.