రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొన్ని నెలలుగా చర్చల్లో నిలిచిన పీఆర్సీపై నిర్ణయం తీసుకుంది. 23.29 శాతం పీఆర్సీని ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదే క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం జగన్ ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఉద్యోగ సంఘాలతో నిన్న జరిగిన సమావేశంలో వారి నుంచి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈరోజు ఉదయం నుంచి ఆర్థిక శాఖ అధికారులతో పీఆర్సీ అంశంపై సీఎం సమీక్ష నిర్వహించారు.
పెంచిన జీతాలు 2022 జనవరి 1 నుంచి అమలులోకి రానున్నాయి. పెండింగ్ డీఏలు కూడా జనవరి నుంచి చెల్లిస్తామని.. 2020 ఏప్రిల్ నుంచి కొత్త పీఆర్సీ వర్తిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. రెండు రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామని తెలిపిన సీఎం ఈరోజు దీనిపై నిర్ణయం తీసుకున్నారు.