పేదోడి నాడి తెలిసిన డాక్టర్గా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డిని అభివర్ణిస్తారు చాలామంది. రాజకీయ విమర్శలు ఎలా వున్నా వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో తెరపైకొచ్చిన ఆరోగ్యశ్రీ.. ఎంతోమంది పేదలకు ‘ఊపిరి’ పోసిందన్నది నిర్వివాదాంశం. 108 అంబులెన్స్లు వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనలో ప్రముఖ ప్రాచుర్యం పొందిన విషయం విదితమే. ఏదన్నా ప్రమాదం జరిగినా, హఠాత్తుగా గుండె నొప్పి ఇతర ప్రాణాంతకమైన సమస్యలు తలెత్తినా వెంటనే 108కి కాల్ చేస్తే చాలు.. అతి తక్కువ సమయంలో అంబులెన్స్ అందుబాటులోకి వచ్చేస్తుంది.. బాధితుల్ని ఆసుపత్రులకు తరలించేస్తుంది. అలా ఎన్నో ప్రాణాలు 108 ద్వారా కాపాడబడ్డాయి. కానీ, కొన్ని కారణాలతో ఈ 108 సర్వీస్ కొన్ని విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
ఇక, ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం, రికార్డు స్థాయిలో కొత్త అంబులెన్స్ల్ని రంగంలోకి దించింది 108తోపాటు 104 సర్వీసులు.. నియోనాటల్ అంబులెన్స్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అవసరమైన మందులతో, గతంలో కంటే భిన్నంగా అనేక వైద్య పరీక్షలు చేసే వెసులుబాట్లతో వీటిని రూపొందించారు. వీలైనంత ఎక్కువమందికి సేవలు అందించేలా ఈ కొత్త అంబులెన్స్లను డిజైన్ చేశారు.
ఒకేసారి పెద్దమొత్తంలో కొత్త అంబులెన్స్లను తీసుకురావడం ద్వారా ప్రజారోగ్యంపై వైఎస్ జగన్ ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుకుంటోందన్నది అధికార పార్టీ వాదనగా కన్పిస్తోంది. 108 వెనుక పెద్ద కుంభకోణం జరిగిందనే విపక్షాల విమర్శల్ని పక్కన పెడితే, పేదోడి ఆయువు నిలబెట్టే సంజీవనిగా ఈ 108, 104 అంబులెన్స్లను చూడాల్సి వస్తుంది. గ్రామాల్లో అయినా, పట్టణాల్లో అయినా, గిరిజన ప్రాంతాల్లో అయినా అత్యవసర పరిస్థితుల్లో వున్నవారికి రికార్డు స్థాయిలో అందుబాటులోకి వచ్చేలా ఈ అంబులెన్స్లను రూపొందించారు. ఆధార్ కోసం బయోమెట్రిక్ యంత్రాల్ని వీటిల్లో అమర్చారు. తద్వారా రోగికి సంబంధించిన పూర్తి వివరాల్ని పొందు పర్చడానికి వీలవుతుంది. జీపీఎస్, మొబైల్ డేటా టెర్మినల్, ఆటోమేటిక్ వెహికిల్ లొకేషన్ టాండ్.. వంటి ఏర్పాట్లు ఈ అంబులెన్స్లలో వున్నాయి.
104 వాహనాల ద్వారా వైద్యులు గ్రామాలకు వెళ్ళి మెరుగైన వైద్య సేవలు అందించనున్నారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ఈ వాహనాల్లోనే ఏర్పాటు చేసిన మినీ ల్యాబ్స్ ద్వారా పలు రకాల వైద్య పరీక్షలు చేసి, అవసరమైన మందుల్ని రోగులకు ఇస్తారు. టెలిమెడిసిన్ విధానం ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు గ్రామీణ ప్రాంత ప్రజలకు అందుతాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారిని అతి తక్కువ సమయంలో ఆసుపత్రులకు చేర్చి, వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అంబులెన్స్లు ఎంతగానో ఉపయోగపడ్తాయి. బేసిక్ లైఫ్ సపోర్ట్, అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్.. అంటూ రెండు కేటగిరీల్లో 108 అంబులెన్స్లను తీర్చిదిద్దడం గమనార్హం.
మొత్తమ్మీద, ఇకపై రాష్ట్రంలో మరింత మెరుగ్గా 108, 104 సేవలు ప్రజలకు అందుతాయని నిస్సందేహంగా చెప్పొచ్చు. అయితే, ఈ సేవల విషయంలో మొదట ప్రదర్శించిన ఉత్సాహం ఆ తర్వాత పాలకుల్లో వుండటంలేదు. చిన్నపాటి మరమ్మత్తులు రాగానే ఖరీదైన వాహనాల్ని మూలన పడేస్తున్న సందర్భాలు గతంలో చూశాం. ఈసారి అలాంటి నిర్లక్ష్యానికి ఆస్కారమివ్వకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందనే ఆశిద్దాం.
1088 – 104, 108 అంబులెన్స్ వాహనాలను జండా ఊపి ప్రారంభించిన @ysjagan
గారు#108_104LegacyContinues#YSJaganCares #TDP #YSRCP #Janasena #TDPTwitter pic.twitter.com/0dmYaUWOmj— TeluguBulletin.com (@TeluguBulletin) July 1, 2020