మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి( YS Vivekananda Reddy) స్మారక సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( YS Jagan mohan Reddy) పై రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల( YS Sharmila) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ బాబాయిని హత్య చేసిన వారు కళ్ళముందే తిరుగుతున్నా వారిని శిక్షించడం లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైయస్ వివేకానంద రెడ్డి ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో స్మారక సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న షర్మిల మాట్లాడుతూ…
‘ బంధువులే హంతకులని సాక్ష్యాలు చెబుతున్నాయి. బాధితులకు అండగా నిలబడకపోగా తిరిగి వారిపైనే ఆరోపణలు చేస్తున్నారు. సాక్షిలో పైన వైయస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో.. వార్తల్లో మాత్రం ఆయన తమ్ముడి వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? మీకోసం ఆయన కష్టపడినప్పుడు ఆయన వ్యక్తిత్వం కనిపించలేదా?. ఆయన చనిపోయే ముందు రోజు వరకు కూడా వైఎస్ఆర్సిపి కోసం కష్టపడ్డారు. అంతటి వ్యక్తి మరణాన్ని అపహాస్యం చేశారు. ఆయన కుమార్తె సునీత కి న్యాయం చేయాల్సింది పోయి తిరిగి ఆమెపైనే సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేయించారు. జగనన్నా .. మీకు అసలు మనస్సాక్షి ఉందా? అద్దం ముందు నిలబడుకొని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వైయస్ రాజశేఖర్ రెడ్డి తోబుట్టువుల కోసం ఏం చేశారు? ఆయన వారసులుగా తోబుట్టువుల కోసం మీరేం చేస్తున్నారో మీ మనస్సాక్షిని అడగండి’ అని మండిపడ్డారు.
వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత మాట్లాడుతూ..’ 2009 లో పెదనాన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం జగనన్నని రాజకీయాల్లో యాక్టివ్ చేసేందుకు మా నాన్న సిద్ధమయ్యారు. ఒకానొక దశలో జగనన్న కోసం రాజకీయాల నుంచి తప్పుకోవాలని కూడా అనుకున్నారు. చివరిదాకా పులివెందుల ప్రజల కోసమే కష్టపడ్డారు. ఫ్యాక్షనిజాన్ని అరికట్టి పులివెందులలో శాంతి నెలకొల్పాలని భావించిన వ్యక్తిని అతి కిరాతకంగా చంపిన మనుషుల్ని జగనన్న కాపాడుతున్నారు. మీకు అంతఃకరణ శుద్ధి అంటే తెలుసా? మా నాన్నని చంపిన వ్యక్తులను శిక్షించే బాధ్యత మీకు లేదా? నేరస్తులను కాపాడుతూ నా పైనే నిందలేస్తున్నారు. నాకు, నా కుటుంబానికి ఈ హత్యతో సంబంధం ఉన్నప్పుడు మమ్మల్ని ఎందుకు అరెస్టు చేయలేదు?’ అని ప్రశ్నించారు.