YSRCP-BJP: భారతీయ జనతా పార్టీ దారెటు.? టీడీపీ – జనసేన కూటమి వైపా.? లేదంటే, వైసీపీ వైపా.? ఈ విషయమై రాజకీయ వర్గాల్లో గత కొద్ది రోజులుగా చర్చోపచర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీలోని వైసీపీ సానుభూతిపరులు, ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో కలవొద్దంటూ బీజేపీ అధినాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.
మరోపక్క, బీజేపీలోని టీడీపీ సానుభూతిపరులేమో టీడీపీతో కలిసి వెళ్ళడమే లాభమంటూ అధినాయకత్వానికి నివేదికలు ఇస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. ఏపీలోని బీజేపీ ముఖ్య నేతల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది.
చాలాకాలంగా బీజేపీతోనే వున్న కమలనాథులతో (ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా వుంటున్నవారి నుంచి కూడా) మాట్లాడి, నివేదికలు తెప్పించుకుని.. లెక్కలేసుకుంటోందిట బీజేపీ నాయకత్వం.
వైసీపీ పట్ల ప్రజా వ్యతిరేకత పెరుగుతోందనీ, ఆ పార్టీతో కలిసి వెళ్ళడం వల్ల ప్రయోజనం వుండదనీ, ప్రాథమికంగా బీజేపీ అధినాయకత్వానికి రిపోర్ట్స్ వెళుతున్నట్లు తెలుస్తోంది. దాంతో, టీడీపీ వైపు ప్రస్తుతానికి బీజేపీ మొగ్గు కనిపిస్తోందని అంటున్నారు.
అయితే, ‘టీడీపీని నమ్మి మోసపోయాం.. ఈసారి ఆ తప్ప చేయకూడదు..’ అన్న ఒక్క ఆలోచన బీజేపీని కాస్త వెనక్కి లాగుతోందిట. మరోపక్క, వైసీపీ నుంచి ఓ బృందం, బీజేపీ అధినాయకత్వంతో సంప్రదింపులు జరుపుతోంది.
టీడీపీ – జనసేనకు దూరంగా వుంటేనే బీజేపీకి మంచిదనీ, వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోకున్నా.. రెండు పార్టీల మధ్యా అవగాహన వుంటే బావుంటుందనీ ఆ బృందం బీజేపీ నాయకత్వానికి సూచిస్తోందిట. ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ప్రస్తుతానికైతే వైసీపీతో బీజేపీ పొత్తుకి అవకాశాలే లేవని అంటున్నారు.