Why Not 175: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘వైనాట్ 175’ అంటున్నారు. అదే మాట మీదున్నారు కూడా.! తప్పదు, పార్టీ శ్రేణులకు ఇదే మాట చెప్పాలి. లేకపోతే, ఎన్నికల నాటికి పార్టీలో ఎవరూ మిగలరన్న సెటైర్లు వైసీపీ మీద పడుతున్నాయి రాజకీయ ప్రత్యర్థుల నుంచి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనూహ్యంగా మారాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టుతో, గ్రౌండ్ లెవల్లో వైసీపీ పట్ల వ్యతిరేకత అనూహ్యంగా పెరిగిపోయింది. చంద్రబాబు జైలు నుంచి విడుదల కాకపోవడం, చంద్రబాబే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో కోట్లు కొట్టేశారని నిరూపించలేకపోవడం.. ఇవన్నీ వైసీపీకి ‘నెగెటివ్’గా మారుతున్నాయి.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో బెయిల్ కోసం కాకుండా, ‘క్వాష్’ దిశగా చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు వైసీపీకి సంకటంగా మారాయి. ఒకవేళ ‘స్క్వాష్’కి అనుకూలంగా తీర్పు వస్తే మాత్రం, వైసీపీ స్థాయి మరింతగా పతనైపోతుంది. చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి వుంటే, ఆయన్ని మళ్ళీ లోపలేసే దిశగా తెరపైకి తెస్తున్న కొత్త కేసులూ, వైసీపీకి ప్రజాక్షేత్రంలో ఇబ్బందికరంగా మారతున్నాయి.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ముప్ఫయ్కి పైగా కేసులున్నాయి. వాటిల్లో కొన్ని కేసులకు సంబంధించి ఆస్తుల అటాచ్మెంట్ కూడా జరిగింది. అదే, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో అక్కడి వరకూ వ్యవహారం వెళ్ళలేదు. ‘జగన్ మీద కేసులున్నాయి కాబట్టి, చంద్రబాబు మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు..’ అన్న సంకేతాలు జనంలోకి వెళ్ళిపోయాయి.
ఇంకోపక్క, జనసేన పార్టీ అనూహ్యంగా పుంజుకుంది ఆంధ్రప్రదేశ్లో. ఉభయ గోదావరి జిల్లాల్లోని చాలా నియోజకవర్గాల్లో, జనసేన పార్టీ ప్రస్తావన తప్ప, మరో పార్టీ ప్రస్తావనే ఇటీవలి కాలంలో కనిపించకపోవడం.. ఇదంతా ‘వారాహి విజయ యాత్ర’ ఎఫెక్ట్.. అని చెప్పక తప్పదు. ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ జనసేనకు అడ్వాంటేజ్ కనిపిస్తోంది.
జనసేన – టీడీపీ కలిసి పోటీ చేయనుండడంతో, వైసీపీ పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో అత్యంత దారుణంగా తయారైంది. కొందరు వైసీపీ సీనియర్లు, ఇప్పటికే చేతులెత్తేశారు.. తాము ఎన్నికలకు దూరంగా వుంటామని అధినేతకు చెబుతూ. మరి, వైనాట్ 175 ఎలా.?