చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోదీ అకస్మాత్తుగా లెహ్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణెలతో కలిసి మోదీ అకస్మాత్తులో లెహ్ వెళ్లారు. సముద్రమట్టానికి 11వేల అడుగుల ఎత్తులో ఉన్న కీలకమైన ఫార్వర్డ్ లొకేషన్ నీములో పర్యటించారు. సరిహద్దుల్లో పరిస్థితులు, యుద్ద సన్నద్ధత వంటి అంశాలపై ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జవాన్లతో మాట్లాడారు. గల్వాన్ ఘర్షణల్లో గాయపడిన జవాన్లను కూడా పరామర్శించనున్నారు. కాగా మన దేశ ప్రధాని నీములో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.
నిజానికి శుక్రవారం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అక్కడ పర్యటించాల్సి ఉంది. అయితే, గురువారం సాయంత్రం రాజ్ నాథ్ పర్యటన రద్దు అయినట్టుగా ప్రభుత్వం నుంచి సమాచారం వచ్చింది. అయితే, ఎందుకు రాజ్ నాథ్ పర్యటన రద్దు అయిందనే అంశాన్ని మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా మోదీ లెహ్ వెళ్లడం సంచలనమైంది. ప్రధాని పర్యటన గురించి చివరి క్షణం వరకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ కు సైతం తెలియదని సమాచారం.
గల్వాన్ ఘర్షణల తర్వాత సరిహద్దుల్లో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఓ వైపు చర్చలు జరుగుతున్నా చైనా మాత్రం తన బలగాలు, ఆయుధాలను సరిహద్దులకు తరలిస్తోంది. దీంతో భారత్ సైతం అంతే ధీటుగా స్పందించి మన బలగాలను సరిహద్దులకు తరలించింది. మరోవైపు చైనా అటు పాకిస్తాన్ తోనూ, ఇటు ఉగ్రవాదులతోనూ కూడా సంప్రదింపులు జరిపి భారత్ పైకి ఎగదోస్తుందనే ఆరోపణలు వచ్చాయి. ముప్పేట దాడి ద్వారా భారత్ ను దెబ్బ కొట్టాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్న డ్రాగన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని భారత్ కూడా సిద్ధమవుతోంది.
ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉన్నామని తెలియజేసేందుకే ప్రధాని మోదీ లెహ్ లో పర్యటించినట్టు తెలుస్తోంది. కాగా, ప్రధాని లెహ్ పర్యటన భారత సైనికుల్లో కదనోత్సాహం నింపిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ ట్వీట్ చేశారు. అక్కడ పర్యటించేందుకు వెళ్లిన మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు ఈ పర్యటన తర్వాత ప్రధాని మోదీ.. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ లతో సమావేశమవుతారు. దీంతో అందరి దృష్టీ ఈ భేటీపైనే ఉంది.