సీనియర్ నటి, మాజీ ఎంపీ విజయశాంతి( Vijaya Shanthi) తిరిగి కాంగ్రెస్ లో చేరారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. రెండు రోజుల క్రితం ఆమె బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలి పదవికి, ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన రాజీనామా లేఖని రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందజేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ మీద విజయశాంతి ఆగ్రహంగా ఉన్నారు.
కాగా కొద్ది రోజుల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కూడా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన చేరికపై అసహనం వ్యక్తం చేస్తూ… తెలంగాణ ఉద్యమ వ్యతిరేకులతో వేదిక పంచుకోవాల్సి వస్తుందంటూ సోషల్ మీడియాలో విజయశాంతి పోస్ట్ పెట్టారు. అప్పటినుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆమె ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం ఎప్పటికీ కాంగ్రెస్సేనని.. ఈసారి ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ ని ఫామ్ హౌస్ కి పరిమితం చేస్తారని అన్నారు .