తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, సెక్రెటేరియట్కి వెళ్ళింది లేదు. దానికి ఆయన చెప్పిన ప్రధాన కారణం ‘వాస్తు దోషం’. ఈ దోషం కారణంగానే, సెక్రెటేరియట్ని కూల్చివేస్తున్నారు. నిజానికి, ఇదే సెక్రెటేరియట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సేవలందించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయాక కూడా, రెండు తెలుగు రాష్ట్రాలకూ ఈ సెక్రెటేరియట్ సేవలు అందించిన విషయాన్ని ఎలా కాదనగలం.?
ప్రభుత్వం కొత్త సెక్రెటేరియట్ నిర్మించాలనుకుంటే.. దాన్నెవరూ తప్పుపట్టలేరు. కానీ, ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో సెక్రెటేరియట్ని కూల్చేయాల్సిన అవసరమేంటి.? ఇంతలోనే, వర్షాలు ముంచుకొచ్చాయి.. తెలంగాణలోనే ప్రముఖమైన ఆసుపత్రిగా పేరొందిన ఉస్మానియాలో మురుగు నీరు ఉప్పొంగింది. పేషెంట్లు వున్న గదుల్లో మోకాళ్ళ లోతులో నీళ్ళు వచ్చిచేరాయి. వరదను తలపించింది అక్కడి పరిస్థితి. కరోనా కిట్స్ (పీపీఈ) కూడా ఆ వరద నీటిలో కొట్టుకుపోయాయి.
నిజానికి, సెక్రెటేరియట్తోపాటుగా ఉస్మానియా ఆసుపత్రి విషయంలోనూ కేసీఆర్ ‘గొప్ప గొప్ప మాటలు’ చాలా చెప్పారు. కానీ, ఏమయ్యింది.? ముఖ్యమంత్రిగా ఇప్పటికే ఆరేళ్ళ పాలన పూర్తి చేసుకున్నారు కేసీఆర్. గడచిన ఆరేళ్ళలో ఉస్మానియా ఆసుపత్రి రూపురేఖలు ఎందుకు మారలేదు.? పైగా, ఇప్పుడేమో అధికార పార్టీ వాదన చాలా ‘వింతగా’ కన్పిస్తోంది ఉస్మానియా విషయంలో. ‘ఉస్మానియా విషయంలో బీజేపీ, కాంగ్రెస్ నానా రాద్ధాంతం చేశాయి.. అందుకే ఉస్మానియా దుస్థితి ఇలా తగలడింది..’ అని టీఆర్ఎస్ చెబుతోంది.
ఆరేళ్ళ కేసీఆర్ పాలనలో ఉస్మానియాకి ఎందుకీ దుస్థితి.? అని ప్రశ్నిస్తే, గులాబీ శ్రేణులు తమదైన ‘చెత్త’ రాజకీయ విమర్శలతో విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాయి తప్ప, తమ వైఫల్యాన్ని ఒప్పుకునేందుకు మాత్రం సాహసించడంలేదు. దేశవ్యాప్తంగా ఇప్పుడీ ‘ఉస్మానియాలో మరుగు వరద’ అంశం హాట్ టాపిక్గా మారింది. హైద్రాబాద్ని విశ్వ నగరంగా మార్చేస్తున్నామని మంత్రి కేటీఆర్ పదే పదే చెబుతుంటారు. విశ్వ నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రి.. పైగా పేదల పెద్దాసుపత్రి ఇలాగేనా.? మురుగు నీటిలో రోగులు అష్టకష్టాలు పడాల్సిందేనా.? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విపక్షాలు యాగీ చేశాయి.. మరో విషయంలోనూ విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అవేవీ ఆగలేదు. కానీ, ఉస్మానియా మాత్రం బాగుపడలేదు. ఇంకా తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు బుకాయింపు చర్యలకు దిగితే, ‘గులాబీ బాస్’ నవ్వులుపాలైపోతారు తప్ప.. బుకాయింపులతో ప్రయోజనమేమీ వుండదు.