బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న భూమా అఖిలప్రియ మూడు రోజుల కస్టడీ ముగిసింది. పోలీసుల విచారణలో ఆమె నుంచి కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. దీంతో రేపు మధ్యాహ్నం ఆమెను పోలీసులు న్యాయస్థానంలో ప్రవేశపెట్టనున్నారు. అయితే.. ఆమె ఎక్కువ ప్రశ్నలకు దాటవేత సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది. పోలీసులు సేకరించిన కీలక ఆధారాలను ఆమె ముందు ప్రవేశపెట్టడంతో కొన్నింటికి సమాధానం చెప్పినట్టు తెలుస్తోంది.
ప్రవీణ్ రావు కుటుంబంతో హఫీజ్ పేటకు చెందిన 25 ఎకరాల భూవివాదం ఉన్నట్టు ఆమె చెప్పారని అంటున్నారు. చర్చలకు ప్రయత్నించగా ప్రవీణ్ రావు కుటుంబం నిరాకరించినట్టు ఆమె చెప్పారని తెలుస్తోంది. గుంటూరు శ్రీను విషయంలో.. తాను రాజకీయ నాయకురాలిని కాబట్టి తనకు ఎవరెవరో ఫోన్లు చేస్తూంటారని చెప్పారని సమాచారం. అయితే.. ఈ కేసులో ఆమె భర్త భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను ఇంకా పరారీలోనే ఉన్నారు. వారు ఆచూకీ లభిస్తే ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.