అధికార పార్టీకి చెందిన నేతలైతే పొద్దున్న లేచిన దగ్గర్నుంచి బూతులు తిట్టొచ్చు.. వాటిపై విపక్షాలకు చెందిన నేతలు సమాధానం కూడా చెప్పకూడదు. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నది భారత రాజ్యాంగం కాదు.. ఇంకోటేదో రాజ్యాంగమన్నది వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ విపక్షాల నుంచి వినిపిస్తోన్న వాదన.
ఎవడికి దెబ్బ తగిలితే, వాడు మాత్రమే ఏడుస్తాడన్నది పదే పదే నిరూపితమవుతోన్న వాస్తవం. వ్యవస్థలు నాశనమైపోతున్నా పట్టించుకోవాల్సిన కేంద్రం పట్టించుకోవడంలేదన్నదీ నిర్వివాదాంశం. చివరికి బీజేపీ నేతలు, కార్యకర్తల మీద వైసీపీ గూండాల దాడులు జరుగుతున్నా.. ‘పెద్దన్న’ బాధ్యతను కేంద్రం విస్మరిస్తుండడం శోచనీయం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్న డిమాండ్ నిన్న తెలుగుదేశం పార్టీ నుంచి దూసుకొచ్చింది. స్థానిక ఎన్నికల వేళ, విపక్షాల నుంచి అభ్యర్థులు నిలబడలేని దుస్థితిని రాష్ట్రంలో అమలవుతోన్న ఓ దిక్కుమాలిన రాజ్యాంగం తీసుకొచ్చింది. నామినేషన్లు వేయడానికి వెళితే, విపక్ష అభ్యర్థులపై దారుణాలకు తెగబడ్డారు అధికార పార్టీ నేతలు. అయినా, కేంద్రం స్పందించలేదు.
తిరుపతి ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార పార్టీ దొంగ ఓటర్లను బస్సుల్లోనూ, ఇతర వాహనాల్లోనూ తీసుకొచ్చినా.. కేంద్రం లైట్ తీసుకుంది. ఇప్పుడు ఏకంగా విపక్ష పార్టీలకు చెందిన కార్యాలయాలపై దాడులకు తెగబడుతున్నాయి వైసీపీ మూకలు. మరిప్పుడైనా కేంద్రం రాష్ట్రంలోని పరిస్థుతులపై స్పందిస్తుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
‘వాళ్ళే ప్రభుత్వాధినేతను తిట్టారు.. ఆపై వాళ్ళే తమ పార్టీ కార్యాలయాలపై దాడులు చేసుకున్నారు..’ అని హోం మంత్రి నుంచి ప్రకటన వచ్చాక, ఈ తరహా రాజకీయ దాడులు ముందు ముందు ఆగే అవకాశమే లేదు సరికదా, ముందు ముందు మరిన్ని దాడులు జరిగే ప్రమాదముంది.
‘మా నాయకుడి మాటకు కట్టుబడి ఆగిపోతున్నాం.. లేదంటే, మీ పార్టీ కార్యాలయాలపై దాడులు జరగకుండా వుంటాయా.?’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నుంచి ‘ట్వీటు’ వచ్చిందంటే.. ముందు ముందు రాష్ట్రంలో రాజకీయం ఇంకెంత భయానకంగా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంత భయానక పరిస్థితుల్ని అదుపులోకి తీసుకురావాలంటే రాష్ట్రపతి పాలన తప్ప మరో మార్గమే లేదు.