క్రికెట్ ఫార్మాట్ ఏదైనా ఆరాధిస్తారు భారతీయులు. ఐపీఎల్ ను అదే రీతిలో స్వాగతించారు. 2008లో ప్రారంభమైన మొదటి సీజన్ నుంచి 2020 వరకూ మొత్తం 13 సీజన్లు జరిగాయి. టీమ్స్, అంతర్జాతీయ, దేశీయ, వర్ధమాన క్రికెటర్స్ తో చీర్ గళ్స్ సందడి మధ్య కోలాహలంగా జరుగుతుంది ఐపీఎల్. అయితే.. 2020లో 13వ ఐపీఎల్ టోర్నమెంట్ కు కరోనా రూపంలో ఎదురైన అవరోధాన్ని బీసీసీఐ, ఐపీల్ యాజమాన్యం విజయవంతంగా అధిగమించారు. 13వ సీజన్ ముంబై ఇండియన్స్ విజేతగా నిలిచింది. ఈ సందర్భంగా టీమ్ ఇండియా కోచ్ రవిశాస్త్రి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.
‘అసాధ్యం అనుకున్న ఐపీఎల్ 2020 సీజన్ ను సుసాధ్యం చేశారు. ఈ సందర్భంగా బీసీసీఐకు, ఐపీల్ నిర్వాహకులకు నా అభినందనలు’ అంటూ ట్వీట్ చేశాడు. ఈక్రమంలో ఐపీఎల్ నిర్వాహకులను పేరు పేరునా అభినందించాడు. బీసీసీఐ, మెడికల్ స్టాఫ్ కు అభినందనలు అన్నాడు. ముఖ్యమైన బీసీసీఐ చీఫ్ సౌరభ్ గంగూలీ పేరు ప్రస్తావించకుండా ఆ ట్వీట్ చేశాడు. ఇదే క్రికెట్ అభిమానులకు, గంగూలీ అభిమానులకు, నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తోంది. నీ బాస్ ఎవరో కూడా నువ్వు మర్చిపోయావా..? అంటూ రవిశాస్త్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఐపీఎల్ 2020 సీజన్ ను నిర్వహించాలా వద్దా అనే మీమాంశలో ఉన్నప్పుడు దుబాయ్ పరిస్థితులను అధ్యయనం చేసిన ప్రేక్షకులు లేకుండా, ఎన్నో జాగ్రత్తలు తీసుకుని టోర్నీ నిర్వహించడంలో కీలకపాత్ర పోషించాడు గంగూలీ. ఎటువంటి అపశృతి లేకుండా టోర్నీ విజయవంతమైంది. అందరి క్రమశిక్షణే ఇందుకు కారణం అంటూ గంగూలీ కూడా వ్యాఖ్యానించాడు. ఈ నేపధ్యంలో గంగూలీ పేరును రవిశాస్త్రి ప్రస్తావించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
Take a BOW @JayShah, Brijesh Patel, @hemangamin and the medical staff of the @BCCI for pulling off the impossible and making it a Dream @IPL #IPL2020 #IPLfinal pic.twitter.com/5rL6oqOLmC
— Ravi Shastri (@RaviShastriOfc) November 10, 2020