ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రూపొందుతున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చింది. ఒక అద్బుతమైన దృశ్య కావ్యంగా ప్రేమ కావ్యంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. మొదటి నుండి ఒక మంచి ఆర్ట్ లేదా పెయింటింగ్ ను చూస్తున్నట్లుగా ఈ సినిమాను చూస్తుంటే అనిపిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు. తాజాగా విడుదల అయిన పోస్టర్ కూడా మరోసారి అదే ఫీలింగ్ ను కలుగ జేసింది.
మహా శివ రాత్రి సందర్బంగా విడుదల అయిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శివ పార్వతి ప్రేమ గౌరవార్థం రాధేశ్యామ్ మహాశివరాత్రి ప్రత్యేక పోస్టర్ అంటూ చిత్ర యూనిట్ సభ్యులు ఈ పోస్టర్ ను ఆవిష్కరించారు. పెద్ద ఎత్తున ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఇప్పటి నుండే సన్నాహాలు చేస్తున్నారు. సినిమా ఈ ఏడాది జులై 30వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కృష్ణం రాజు ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెల్సిందే.