ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇటీవల జరిగిన పోలింగ్ తాలూకు ఫలితాలు ఇంకో నెల రోజుల్లో వెల్లడి కానున్నాయి. మే 23న ఫలితాలు వెల్లడవుతాయి. ఈలోగా తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘గెలిచేది మేమే’ అంటూ జబ్బలు చరుచుకుంటున్నాయి. ఒక పార్టీపై ఇంకో పార్టీ దుమ్మెత్తి పోసుకోవడం చూస్తున్నాం. ఓటరు తన తీర్పుని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లలో నమోదు చేసిన తర్వాత, ఆ ఫలితమేంటో తెలియకుండానే ఆయా పార్టీలు అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడం హాస్యాస్పదం.
ఎవరి అంచనాలు వారికి వుండడం తప్పు కాదు. కానీ, ఆ అంచనాల పేరుతో ప్రత్యర్థుల్ని చులకన చేయడం ఖచ్చితంగా ఆక్షేపణీయమే అవుతుంది. జనసేన ప్రభావంపై తెలుగుదేశం పార్టీకి కొంత బెంగ వున్న మాట వాస్తవం. ఆ బెంగతోనే కొంచెం ఆచి తూచి స్పందిస్తోంది టీడీపీ, జనసేన విషయంలో. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి వేరు. జనసేనను చాలా చులకనగా చూస్తోంది జగన్ పార్టీ. జనసేనను మాత్రమే కాదు, టీడీపీ విషయంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరు ఇలాగే వుంది.
2014 ఎన్నికల సమయంలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అత్యుత్సాహం ఇలాగే కనిపించింది. ఎన్నికల ఫలితాలొచ్చాక, ‘తక్కువ మార్జిన్తోనే ఓడిపోయాం..’ అంటూ తమ ఓటమికి కుంటి సాకులు వెతుక్కుంటూ ప్రధానంగా జనసేన మీద అక్కసు ప్రదర్శించడం చూశాం. బహుశా, ఈసారి ఎన్నికల ఫలితాలు కూడా తమను వెక్కిరిస్తే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడేది జనసేన మీదనే కావొచ్చు. ఎందుకంటే ఆ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి టీడీపీ కాదు, జనసేన మాత్రమే అన్నట్లున్నాయి రాజకీయ సమీకరణాలు.
ఇదిలా వుంటే, అదికార తెలుగుదేశం పార్టీ ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గెలిచే అభ్యర్థులెవరన్నదానిపై ఆరా తీసి, వారికి గాలం వేసే పనిలో బిజీగా వుందన్న వార్త ఒకటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. ఫలితాల వెల్లడికి రెండ్రోజుల ముందే తమ పార్టీ అభ్యర్థుల్ని అమరావతికి రావాలంటూ ‘క్యాంపు రాజకీయాలకు’ సన్నాహాలు ప్రారంభించింది తెలుగుదేశం పార్టీ. ఈ క్యాంపులో టీడీపీ అభ్యర్థులే కాదు, కొందరు వైసీపీ అభ్యర్థులు కూడా వుండబోతున్నారని సమాచారమ్.
మొన్నటివరకూ టీడీపీలో వుండి, చివరి నిమిషంలో వైసీపీలోకి చేరి, ఆ పార్టీ జెండాతో పోటీ చేసిన 15 నుంచి 20 మంది అభ్యర్థుల వరకు టీడీపీ నిర్వహించబోయే అమరావతి క్యాంపులో దర్శనమిస్తారట. అదే గనుక జరిగితే, అంతకు మించిన స్థాయిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ‘క్యాంపు’ ఏర్పాటు చేసే అవకాశం లేకపోలేదు. అయితే వైసీపీ ‘క్యాంపు’ హైద్రాబాద్లో వుంటుందని ఆఫ్ ది రికార్డ్గా వైసీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
‘క్యాంపు’ అంటే కొనుగోళ్ళ సంత అని కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏముంది? కర్నాటక, తమిళనాడుల్లో ఇలాంటి ‘క్యాంపుల్ని’ ఎక్కువగా చూస్తుంటాం. అప్పుడప్పుడూ తెలుగు రాజకీయాల్లోనూ ఈ క్యాంపుల నిర్వహణలు మామూలే. నేతల్ని కోట్లు వెచ్చించి ఖర్చు చేసి, వారిని తమ వెంట తిప్పుకోవడమే ఈ క్యాంపుల లక్ష్యం. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే జనసేన పార్టీకి చెందిన కొందరు అభ్యర్థులకు కూడా టీడీపీ, వైసీపీ గాలం వేస్తున్నాయట తమ తమ క్యాంపుల్లోకి లాగడానికి.
ఎన్నికల తర్వాత క్యాంపుల్ని చూశాంగానీ, ఎన్నికలకు ముందర ఈ క్యాంపుల ఏర్పాట్లు ఏంటని తలపండిన రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటున్నారు. అయితే, ప్రభుత్వాలు ఏర్పాటయ్యాక ఎలాగూ మళ్ళీ మలి దఫా కొనుగోళ్ళ వ్యవహారముంటుందనీ, ఈలోగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం కొనుగోళ్ళు తప్పకపోవచ్చునని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
