తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షా ఫలితాల విషయంలో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మూడు లక్షల మందికి పైగా విద్యార్థులు తమ భవిష్యత్తుపై బెంగతో గగ్గోలు పెడుతోంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తీరిగ్గా సమీక్ష నిర్వహించి, కొన్ని ఉపశమనాలైతే ప్రకటించారు. పరీక్ష ఫెయిల్ అయినవారికి రీ-వెరిఫికేషన్, రీ-వాల్యూయేషన్ ఉచితంగా చేయాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో, ఈ విషయం తెలుసుకున్న విద్యార్థులు కాస్త ఊరట చెందుతున్నారు.
మొత్తం 19 మంది విద్యార్థులు ఇప్పటికే పరీక్షా ఫలితాల గందరగోళం నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెల్సిందే. విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించిన కేసీఆర్, విచారం కూడా వ్యక్తం చేశారు. విద్యార్థులకు ధైర్యం చెప్పే ప్రయత్నమూ చేశారు. వీలైనంత త్వరగా రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్, రీ-వాల్యూయేషన్ ప్రక్రియలు చేపట్టి, పోటీ పరీక్షలకు ఇబ్బంది కలగకుండా చేయాలని కేసీఆర్ సూచించడం పట్ల చాలామంది విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
అయితే, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకాస్త ముందుగా స్పందించి వుంటే, విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం అంతటా వ్యక్తమవుతోంది. నిజానికి తొలుత అసలు లోపాలే జరగలేదని ఇంటర్మీడియట్ బోర్డు బుకాయించింది. ఈ రోజు మధ్యాహ్నం కూడా విద్యా శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, తప్పులే దొర్లలేదనీ.. చిన్న విషయాన్ని పెద్ద రాద్ధాంతంగా చూపిస్తున్నారనీ మీడియాపై మండిపడ్డారు. ఈ మొత్తం వ్యవహారాన్ని డీల్ చేసిన ‘గ్లోబరీనా’ సంస్థ కూడా తప్పులేం జరగలేదనే బుకాయించడం చూశాం.
తాజాగా ఈ రోజు ముగ్గురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటంతో విషయం మరింత వివాదాస్పదమయ్యేసరికి, కేసీఆర్ స్పందించాల్సి వచ్చిందని భావించాలేమో. పొరుగు రాష్ట్రాల్లోనూ, అవసరమైతే పొరుగు దేశాల్లోనూ పరీక్షల నిర్వహణపై పరిశీలన చేయాలనీ, అవసరమైతే ఆ సాంకేతికతను తెలంగాణలోనూ వినియోగించాలని కేసీఆర్ సూచించడాన్ని అభినందించాల్సిందే. అయితే విద్యార్థుల ఆత్మహత్యలు కొత్తేమీ కాదు. ఈసారి ఇంకాస్త ఎక్కువగా మీడియాలో ఫోకస్ అయ్యిందంతే. ఇప్పటిదాకా ఈ విషయంలో ప్రభుత్వమెందుకు చొరవ చూపించలేదన్నది చాలామంది విద్యార్థుల తల్లిదండ్రుల ప్రశ్న.
ఇదిలా వుంటే, పాస్ అయిన విద్యార్థుల్లోనూ కొందరు ‘లక్కు కొద్దీ’ అదనపు మార్కులు పొందారనీ, ఇందులోనూ చాలా తప్పిదాలు జరిగాయనే విమర్శలు విన్పిస్తున్నాయి. 99 మార్కులు వచ్చిన విద్యార్థినికి సున్నా మార్కులేసిన ఘనులు, సున్నా మార్కులొచ్చిన విద్యార్థికి 99 మార్కులు వేయలేదని ఎలా అనుకోగలం? తనకు 27 మార్కులు వస్తే ఫెయిల్ అని రాశారనీ, 17 మార్కులు వచ్చిన మరో విద్యార్థికి పాస్ అని పేర్కొన్నారని ఓ విద్యార్థి చెబుతున్న విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిందే.
ఎలా చూసినా, ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వాహణ చాలా అధ్వాన్నంగా జరిగిందనే విషయం అర్థమవుతోంది. అధికారులు, గ్లోబరీనా సంస్థ మాత్రమే కాదు, అధికారంలో వున్నవారు కూడా ఈ తప్పిదానికి బాధ్యత వహించి తీరాల్సిందే. అన్నిటికీ మించి, ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం ద్వారా వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినందుకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మొత్తంగా 19 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలకు బాధ్యత వహించి తీరాలనే వాదన విపక్షాల నుంచి వ్యక్తమవుతోంది.
