సంక్రాంతి పండగ నేపథ్యంలో గుడివాడలో మంత్రి కొడాలి నానికి చెందిన కె-కన్వెన్షన్ సెంటర్లో క్యాసినో నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ కూడా విమర్శలు చేసింది. ఈనేపథ్యంలో గుడివాడలో క్యాసినో నిర్వహణపై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ వేసింది. ఈ ప్రదేశాన్ని కమిటీ పరిశీలించేందుకు గుడివాడ వెళ్లింది. దీంతో గుడివాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
టీడీపీ నేతల రాకతో కొడాలి కన్వెన్షన్ సెంటర్కు వైకాపా శ్రేణులు భారీగా చేరుకున్నాయి. ఇరువర్గాల రాకతో అక్కడ భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. రహదారిపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. డీఎస్సీ సత్యానందం నేతృత్వంలో నెహ్రూ చౌక్, స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.
టీడీపీ వేసిన కమిటీలో సభ్యులుగా నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమ, తంగిరాల సౌమ్య, ఆలపాటి ఉన్నారు. క్యాసినో నిర్వహణపై పూర్తిస్థాయి నివేదికను తెదేపా అధిష్ఠానానికి ఇవ్వనున్నారు. టీడీపీ నేతల గుడివాడ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.