ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ అధినేతలపై విమర్శలు, ఆరోపణలు చేయడం చాలా సాధారణమైన విషయం. తనకు పోటీగా ఉన్న ప్రత్యర్థులపై ధ్వజమెత్తడం ఏ నాయకుడైనా చేసే పనే. టీడీపీ అధినేత చంద్రబాబు వైఎస్సార్ అధినేత జగన్ తోపాటు తెలంగాణ సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడుతున్నారు.
ఇక జగన్ అయితే, చంద్రబాబుతోపాటు ఆయన పార్టనర్ అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరుగుతున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం కేవలం జగన్ మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఎన్నికల్లో ముందుకు సాగుతున్నారు. సాధారణంగా ఎన్నికలు వచ్చినప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు. ఈ ప్రభుత్వం సరిగా పని చేయలేదు.. ఎన్నికల్లో వారిని సాగనంపి మాకు పట్టం కట్టండి అంటూ ప్రచారం చేస్తారు. కానీ పవన్ తీరు ఇందుకు భిన్నంగా ఉంటోంది.
ప్రతిపక్షంలో ఉన్న జగన్ పైనే ఆయన విమర్శలు చేస్తున్నారు. ఫక్తు అధికార పార్టీ నేతగానే వ్యవహరిస్తున్నారు. ఏ సభలోనైనా చంద్రబాబుతో సమానంగా జగన్ పేరునే స్మరిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో జగన్ కు లోపాయికారీ పొత్తు ఉందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. జగన్ కు ఆత్మాభిమానం లేదా? ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయకుండా అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నారు. ఇదేనా పులివెందుల పౌరుషం? అంటూ విరుచుకుపడుతున్నారు.
ప్రశ్నించడానికే తాను వచ్చానంటూ తొలుత ప్రచారం చేసుకున్న పవన్.. తర్వాత సీఎం అవుతానంటూ మనసులో మాట బయట పెట్టుకున్నారు. తర్వాతి పరిణామాల నేపథ్యంలో కింగ్ కాకపోయినా, కింగ్ మేకర్ పాత్ర పోషించగలనని అనుకున్నారు. కర్ణాటక ఎన్నికల్లో 30 సీట్లు వచ్చిన కుమార స్వామి సీఎం అయిపోవడంతో మళ్లీ ఆ కుర్చీపై మనసు పారేసుకున్నారు.
ఏపీలో కూడా అలాంటి పరిస్థితే వస్తే, సీఎం పీఠం ఎక్కొచ్చని భావించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ స్థాయిలో ఆయన కసరత్తు చేస్తున్నారా? పక్కా వ్యూహాలకు ముందుకెళ్తున్నారా అంటే లేదనే అనిపిస్తోంది. అధికార తెలుగుదేశం పార్టీతో రహస్య అవగాహన ఉందంటూ వైఎస్సార్ సీపీ చేస్తున్న ఆరోపణలకు ఊతమిచ్చేలా ఆయన చర్యలు ఉంటున్నాయి.
ప్రచారంలో కేవలం జగన్ ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఏదో మొహంమాటం కొద్దీ టీడీపీ నేతలపై విమర్శలు చేస్తున్నారనే భావన జనాల్లోకి వెళ్లిపోతోంది. ప్రచారంలో భాగంగా జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్న జనసేన అధినేత.. ఈ ఐదేళ్ల కాలంలో ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపడంలేదు. దీంతో సహజంగానే ఈ రెండు పార్టీల మధ్య రహస్య అవగాహన ఉందేమో అనే అనుమానం కలగకమానదు.
వాస్తవానికి పవన్ కల్యాణ్ కు 5 నుంచి 10 శాతం ఓట్లు రాబట్టుకునే సత్తా ఉంది. అయితే, టీడీపీతో తమకు ఎలాంటి అవగాహనా లేదని చెప్పడంతోపాటు ఆ పార్టీ వైఫల్యాలను కూడా గట్టిగా ఎండగట్టి.. టీడీపీకి తామే ప్రత్యామ్నాయం కాగలమనే భరోసా కల్పించడంలో పవన్ విఫలమవుతున్నారు. అలా చేస్తే ఆయనకు మరికొన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది.
కానీ, అలా చేయకపోవడంతో జనసేన సింగిల్ డిజిట్ సీట్లకు మాత్రమే పరిమితం కావొచ్చనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా జగన్ విజయావకాశాలను ప్రభావితం చేయడానికే పవన్ పోటీ చేస్తున్నారన్న విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ఎన్నికల ప్రచారానికి వారం రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో పవన్ తన వ్యవహార శైలి మార్చుకుంటారో లేదో వేచి చూడాలి.
773519 316205I discovered your blog internet site internet website on the internet and appearance some of your early posts. Continue to keep within the wonderful operate. I just now additional increase your Rss to my MSN News Reader. Seeking toward reading far much more from you obtaining out at a later date! 908848