సులభంగా రుణాలిస్తామని పలువురిని ఆకర్షించి.. అనంతరం అప్పు తీసుకున్నవారిని వేధిస్తున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనొక్కడే పదులకొద్దీ యాప్ లు రూపొందించినట్టు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా యాప్ ల రుణదందా కలకలం రేపడంతో పోలీసులు దీనిపై సీరియస్ గా దృష్టిపెట్టారు. ఇప్పటికే పలువురు ఈ వేధింపులను భరించలేక ప్రాణాలు తీసుకోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఇలా వేధింపులకు గురిచేస్తున్న యువకుడిని సైబరాబాద్ పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
నాలుగైదు నెలల నుంచే తాను ఆ యాప్ లు రూపొందిస్తున్నట్టు విచారణలో చెప్పినట్టు సమాచారం. ఇప్పటివరకు అతడి దగ్గర ముగ్గురు రుణం తీసుకోగా.. ఇప్పటికే వారు అప్పు మొత్తానికి అదనంగా 48 శాతం వడ్డీ చెల్లించినట్టు సమాచారం. అయినా ఇంకా డబ్బులు చెల్లించాలని వేధిస్తుండటంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతడి వ్యవహారం బయటకు వచ్చింది.