NBK-NTR: అభిమానులు సోషల్ మీడియాలో ఛండాలంగా తిట్టుకుంటున్నారంటే, ఆయా హీరోలూ జాగ్రత్త పడాలి. ఏ ఇద్దరు హీరోల అభిమానుల విషయంలో అయినాగానీ, ఇదే జరగాలి. కానీ, అలా జరగడంలేదు. ఎందుకిలా.?
సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం బాబాయ్ బాలయ్య అభిమానులకీ, అబ్బాయ్ జూనియర్ ఎన్టీయార్ అభిమానులకీ మధ్య బూతుల యుద్ధం జరుగుతోంది. ఇందులోకి ఇరువురు హీరోల కుటుంబ సభ్యుల్ని, అందునా ఆడవాళ్ళని లాగుతున్నారు. జుగుప్స.. అత్యంత జుగుప్స.. అంతకన్నా దారుణమైన పదం ఇంకోటేదన్నా వుంటే, అదీ సరిపోదు.! అంత ఛండాలంగా వుంది పరిస్థితి.
స్వర్గీయ ఎన్టీయార్ శత జయంతి వేడుకల్లో జూనియర్ ఎన్టీయార్ పాల్గొనకపోవడం వల్లనే ఇదంతా జరుగుతోందా.? అంటే, అభిమానులందు పిచ్చి అభిమానులు వేరయా.. వాళ్ళతోనే ఈ పెంటయా.. అని చెప్పాల్సి వస్తుంది.
అయినాగానీ, ఇది క్షమార్హం కాదు. జూనియర్ ఎన్టీయార్ అలాగే నందమూరి బాలకృష్ణ.. ఇద్దరూ జరుగుతున్న ఈ దారుణంపై స్పందించాలి, అభిమానుల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. కానిపక్షంలో, ఇరువురి కుటుంబాల్లోని ఆడవాళ్ళకు రక్షణ లేకుండా పోతుంది.
టీడీపీకి కాబోయే నాయకుడు జూనియర్ ఎన్టీయారేనని ఓ వైపు, అసలు జూనియర్ ఎన్టీయార్ నందమూరి కుటుంబానికి చెందినోడే కాదని ఇంకో వైపు.. ఇలా నడుస్తోంది వ్యవహారం. మరీ ఇంతకు తెగించారేంటి.? అంటే, అదంతే.!