రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్రమంత్రి అమిత్ షా తో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు. ఈ సందర్భంగా అధికార వైసీపీ ప్రభుత్వం పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు వెనక బీజేపీ హస్తం లేదని తాను నమ్ముతున్నట్లు తెలిపారు.
అనవసరంగా జగన్ అండ్ కో బీజేపీపై నిందలు మోపుతున్నారని అన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా పిలుపుమేరకు నారా లోకేష్ ఢిల్లీ వెళ్లిన లోకేష్ అక్కడ మీడియా తో మాట్లాడారు.
‘ కేంద్ర మంత్రి అమిత్ షా కలవాలనుకుంటున్నట్లు కిషన్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. కేంద్ర మంత్రిని కలిసి చంద్రబాబు నాయుడు అరెస్టు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించాం. చంద్రబాబు భద్రతపై ఆందోళన గా ఉందని చెప్పాను. సిఐడి చంద్రబాబుని ఎందుకు పిలిచిందని ఏ ఏ కేసులు పెట్టారని అమిత్ షా అడిగారు. అవన్నీ రాజకీయ కక్షతో కూడిన కేసులేనని చెప్పాను. చంద్రబాబు అరెస్టు వెనక బీజేపీ హస్తం ఉందని ఒక మంత్రి, ఎంపీ ఆరోపించినట్లు కూడా తెలిపాను. బీజేపీ నేతలు మౌనంగా ఉండడం వల్లే వైసీపీ నాయకులు నిందలు వేస్తున్నారనుకుంటున్నా. చంద్రబాబు అరెస్టు వెనక బీజేపీ లేదని అమిత్ షా స్పష్టం చేశారు. స్కిల్ కేసులో జరుగుతున్న పరిణామాలపై అనుమానం కలుగుతోంది. నా తల్లికి సంబంధించిన ఐటీ రిటర్న్ లు సిఐడి చేతికి ఎలా వచ్చాయనే విషయం పై సీబీడీటీకి కంప్లైంట్ ఇస్తాను’ అని లోకేష్ అన్నారు.