సామాజిక మాధ్యమాల ప్రభావం ఇటీవల విపరీతంగా పెరిగిపోయింది. ఒక రైతు ముఖ పుస్తకంలో (ఫేస్బుక్)లో తనను ఆదుకోవాలని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నాడు. అది చూసిన ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుతో నేరుగా ఫోన్లో మాట్లాడి సమస్యకు పరిష్కారం చూపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
తన ఏడెకరాల భూమిని వీఆర్వో కరుణాకర్ ఇతరులకు పట్టా చేశారంటూ మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లికి చెందిన రైతు శరత్ ఫేస్బుక్లో ఆవేదన వ్యక్తం చేశాడు. 11 నెలలుగా సమస్య అలాగే ఉందని, రైతుల వేదన సీఎంకు చేరే వరకూ షేర్ చేయాలని రైతు విజ్ఞప్తి చేశాడు.
ఆ ఫేస్బుక్ పేజీని చూసిన సీఎం.. నేరుగా రైతుకు ఫోన్ చేసి సమస్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు రైతుకు అన్ని విధాలా న్యాయం చేస్తానని సీఎం భరోసా ఇచ్చారు.
కేసీఆర్ ఆదేశాలతో మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి ఈ వ్యవహారంపై హుటాహుటిన విచారణ చేపట్టారు. బెల్లంపల్లి సబ్కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం నందులపల్లిలో శరత్ ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. భూమిని శరత్కు అప్పగించేందుకు చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏడెకరాల భూమిని ఇతరుల పేరుపై మార్పిడి చేసినట్టు ఫిర్యాదు వచ్చిందని, రైతులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించాలని కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. రైతు బంధు పథకం కూడా బాధిత రైతుకు వర్తింపజేయాలని సీఎం ఆదేశించారన్నారు.