తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకున్నారు. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ విషయమై బీజేపీ నేత, అస్సాం ముఖ్యమంత్రి చేసిన జుగుప్సాకరమైన, అభ్యంతకరమైన వ్యాఖ్యల పట్ల కేసీయార్ తీవ్రంగా స్పందించారు.
‘రాహల్ గాంధీ తండ్రి ఎవరని మేం అడిగామా.?’ అని అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడాన్ని కేసీయార్ తీవ్రంగా తప్పు పట్టారు. దాంతో కాంగ్రెస్ పార్టీకి కేసీయార్ దగ్గరవుతున్నారనీ, కాంగ్రెస్ – టీఆర్ఎస్ కలిసే చాలాకాలంగా రాజకీయ నాటకమాడుతున్నాయన్న తమ వాదన నిజమైందనీ బీజేపీ చెబుతోంది.
నిజానికి బీజేపీ సిగ్గుపడాల్సిన అంశమిది. రాహుల్ గాంధీ తండ్రి విషయమై బీజేపీ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం హర్షించేవి కావు. ‘నీ తండ్రి ఎవరని మేం ఎప్పుడైనా నిలదీశామా..’ అని ఎవరు ఎవర్ని విమర్శించినా, అది అత్యంత జుగుప్సాకరమైన విషయం. ఈ విషయమై తమ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిని బీజేపీ మందలించడం కాదు, పార్టీ నుంచి బహిష్కరించెయ్యాలి. కానీ, అలా చేయడంలేదు బీజేపీ.
కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ విషయంలో వైసీపీ నేతలు కొందరు ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని సాటి వైసీపీ నేతలే చాలామంది ఖండించారు. అలా వ్యాఖ్యానించిన వారిలో ఓ ఎమ్మెల్యే తన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు ప్రకటించి, మీడియా సాక్షిగా క్షమామణ కూడా చెప్పారు.
ఎవరి పుట్టుక గురించి అయినా మాట్లాడే నైతిక హక్కు ఈ భూమ్మీద ఎవరికీ వుండదన్నది కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఆ మధ్య నారా లోకేష్ విషయమై వైసీపీ నేతలు చేసిన విమర్శలకు ఇచ్చిన కౌంటర్. అందులో నిజం లేకపోలేదు కూడా.
రాజకీయంగా విమర్శించడానికి విషయం లేకపోతే, ఇలా వ్యక్తిగత అంశాల జోలికి వెళుతుంటారు. ఆటవిక సమాజంలో కూడా ఇంత హేయమైన ప్రవర్తన వుండదేమో.!