కన్ఫ్యూజన్ కాస్త తొలగింది. అసెంబ్లీకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నారు. అదీ, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే జనసేనాని పోటీ చేస్తారట.! ఈ విషయాన్ని తాజాగా జనసేన పార్టీలో చేరిన పులవర్తి ఆంజనేయులు ప్రకటించారు.
ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని హైద్రాబాద్లో కలిసిన పులవర్తి ఆంజనేయులు, తాను భీమవరం నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘మీరే పోటీ చేయండి..’ అని పవన్ కళ్యాణ్ తనకు సూచించారంటూ పులవర్తి ఆంజనేయులు చేసిన ప్రకటనతో జనసేన శ్రేణులు షాక్కి గురయ్యాయి.
‘పవన్ కళ్యాణ్నే పోటీ చేయమని అడిగాను. నా సంపూర్ణ సహాయ సహకారాలు మీకే వుంటాయని పవన్ కళ్యాణ్గారితో చెప్పాను. ఆయన నన్ను పోటీ చేయమన్నారు. నాకు అవకాశం కల్పించినా, ఆయన పోటీ చేసినా.. ఫర్లేదు.. పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాను..’ అని పులవర్తి ఆంజనేయులు గతంలోనే ప్రకటించారు.
కొద్ది రోజుల క్రితం భీమవరం వెళ్ళిన పవన్ కళ్యాణ్, ఆ పర్యటనలో స్థానిక టీడీపీ, బీజేపీ నేతలతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే, భీమవరం నుంచి పోటీ చేసే విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అప్పట్లో స్పష్టత ఇవ్వలేదు. అయితే, తాజాగా జనసేనాని కాస్త స్పష్టత ఇచ్చారు.
‘భీమవరం వదిలేది లేదు..’ అంటూ పులవర్తి ఆంజనేయులు జనసేనలో చేరిన సందర్భంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం గమనార్హం. భీమవరంలో జనసేన గెలిచాక, స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని జనసేనాని వ్యాఖ్యానించారు. ‘భీమవరం నాది.. వదిలే ప్రసక్తే లేదు..’ అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
జనసేన పార్టీ, పొత్తులో భాగంగా 24 అసెంబ్లీ, 3 లోక్ సభ సీట్లలో పోటీ చేస్తుందని తొలుత ప్రకటన వచ్చినా, తాజాగా 21 అసెంబ్లీ సీట్లు, 2 లోక్ సభ సీట్లకు పరిమితమైంది. ఇప్పటివరకు కేవలం ఆరుగురు అసెంబ్లీ అభ్యర్థుల్నే జనసేన పార్టీ ఖరారు చేసింది.
వీలైనంత త్వరగా జనసేనాని పోటీ చేసే నియోజకవర్గంపై అధికారిక ప్రకటన వస్తే బావుంటుందని జనసేన శ్రేణులు భావిస్తున్నాయి. స్వయంగా పవన్ కళ్యాణ్, ‘భీమవరం నాది’ అని ప్రకటించిన దరిమిలా, ఈ సస్పెన్స్కి ఇక్కడితో తెరపడినట్లే.!