2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జన సేన – టీడీపీ – బీజేపీ.. ఓ కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఎన్డీలో టీడీపీ, జనసేన చేరాయి. రాష్ట్రంలో ఈ మూడు పార్టీల కూటమి అధికారంలోకి వస్తాయా.? ప్రస్తుతం పొలిటికల్ ఈక్వేషన్స్ చూస్తోంటే, క్లియర్ విక్టరీ ఈ కూటమికి సాధ్యమేనన్నది నిర్వివాదాంశం.
ఒకవేళ ఎన్నికల ఫలితాలు వచ్చాక, బీజేపీ ప్లేటు ఫిరాయిస్తేనో.? ఈ అనుమానం టీడీపీ శ్రేణుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆరు ఎంపీ సీట్లు, 10 ఎమ్మెల్యే సీట్లు.. అంటే చిన్న విషయమేమీ కాదు. టీడీపీ అధినేత చంద్రబాబుని బుట్టలో పెట్టి మరీ, ఈ సీట్లను బీజేసీ సాధించగలిగింది.
వాస్తవానికి, జనసేన పార్టీ కంటే ఎక్కువ లాభపడింది బీజేపీనే.. సీట్ల పరంగా. అసెంబ్లీ సీట్లు 21 దక్కించుకున్నా, లోక్ సభ సీట్లు కేవలం రెండే దక్కాయి జనసేనకి పొత్తుల్లో భాగంగా. జనసేన – బీజేపీ మధ్య ఓటు బ్యాంకు తేడా చాలా ఎక్కువే. ప్రస్తుతం వున్న ఈక్వేషన్ ప్రకారం చూస్తే, ఏపీలో బీజేపీ జస్ట్ జీరో.
అలాంటి బీజేపీకి, ఆరు ఎంపీ సీట్లను చంద్రబాబు కేటాయించడం ఆశ్చర్యకరం. కనీసం ఐదారు లోక్ సభ సీట్లను జనసేన దక్కించుకుని వుండాలిగానీ, రెండిటికే పరిమితమయ్యింది. ఇంతలా జనసేన త్యాగం చేసినా, టీడీపీ శ్రేణుల్లో జనసేన పట్ల సానుభూతి పెద్దగా కనిపించడంలేదు.
కూటమి ఏర్పాటుతో, బీజేపీ వల్ల టీడీపీ – జనసేనకు ఏదో లాభం వుంటుందనుకుంటే పొరపాటే. తెరవెనుకాల వైసీపీతో బీజేపీకి వున్న లాలూచీ సుస్పష్టం. టీడీపీని, కొందరు బీజేపీ నేతలు ఇప్పటికీ తీవ్రంగానే ద్వేషిస్తున్నారు.
ఇప్పటికిప్పుడు బీజేపీ, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సి వుంది. ఎన్నికలు సజావుగా సాగేలా, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ చక్రం తిప్పాలి. కానీ, కేంద్ర ప్రభుత్వం వేరు, బీజేపీ వేరు.. అంటూ కమలనాథులు సన్నాయి నొక్కులు నొక్కుతుండడం ఐదేళ్ళుగా చూస్తూనే వున్నాం.!
ఏం నమ్మి, బీజేపీతో కలిసేందుకు టీడీపీ ఒప్పుకుందో, ఏ నమ్మకంతో బీజేపీని, టీడీపీతో కలిసేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కష్టపడ్డారో ఎవరికెరుక.?