2024 సార్వత్రిక ఎన్నికలు జనసేన పార్టీకి అత్యంత కీలకం. అధికార వైసీపీకి అయినా, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి అయినా ఈ ఎన్నికలు చావో రేవో.. అన్న టైపు.! వైసీపీ వైనాట్ 175 అంటోందిగానీ, ఆ పార్టీ నుంచి ప్రజా ప్రతినిథులే ‘మేం వుండలేం మొర్రో..’ అంటూ ఇతర పార్టీల్లోకి పారిపోతున్నారు.
ఇక, తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే, 2019 ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవిచూశాక పూర్తి నిస్తేజంలోకి వెళ్ళిపోయిన క్యాడర్ ఇప్పుడిప్పుడే, కొత్త ఉత్సాహాన్ని పుంజుకుంటోంది. జనసేనతో జతకట్టిన టీడీపీ, ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందన్న అంచనాలు అంతటా వ్యక్తమవుతున్నాయి.
ఇంతకీ, టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేనకి లాభమేంటి.? జనసేనతో జత కట్టడం వల్ల టీడీపికి లాభమేంటి.? ఈ విషయమై చాలా రకాల విశ్లేషణలు చూశాం, చూస్తూనే వున్నాం. జనసేన పార్టీకి గౌరవ ప్రదమైన సీట్లు పొత్తులో భాగంగా కేటాయిస్తేనే, కింది స్థాయిలో ఓటు ట్రాన్స్ఫర్ ఇరు పార్టీల మధ్యా సజావుగా సాగుతుందన్నది బహిరంగ రహస్యం.
అయితే, ఆ గౌరవ ప్రదమైన సీట్లు ఎన్ని.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. జనసేన పార్టీ దాదాపు 72 సీట్లలో పోటీ చేసే అవకాశం వుందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం తాలూకు సారాంశం. ఇదే అభిప్రాయం జనసేన శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది కూడా.
కాగా, జనసేనకు పాతిక ముప్ఫయ్ సీట్ల కంటే ఎక్కువ అనవసరం.. అంటూ, టీడీపీ అను‘కుల’ మీడియా చేస్తున్న ప్రచారం, టీడీపీ – జనసేన మధ్య ఓటు ట్రాన్స్ఫర్కి ఇబ్బందికరంగా మారేలా వుంది.
ఇదిలా వుంటే, ఇప్పటికిప్పుడు జనసేన గెలిచే సీట్లు ఎన్ని.? అన్నదానిపై ఆసక్తికరమైన ఫిగర్ ఒకటి బయటకు వస్తోంది. ఆ ఫిగర్ ప్రకారం చూస్తే, 42 సీట్లలో జనసేన పార్టీ మంచి మెజార్టీతో విజయం సాధించబోతోందిట. అది ఇప్పటికిప్పుడున్న పరిస్థితి. ఎన్నికలకు ఇంకా సమయం వుంది. ఈక్వేషన్స్ ముందు ముందు చాలా మారబోతున్నాయి. మారే ప్రతి ఈక్వేషన్ జనసేనకు పాజిటివ్ ఓటింగ్గా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీ చాలా బలంగా వుందన్నది అందరికీ తెలిసిన విషయం విదితమే. తమకంటే కూడా జనసేన పార్టీ ఈ జిల్లాల్లో బలంగా వుందని టీడీపీ కూడా నమ్ముతోంది. ఆ లెక్కన టీడీపీ కంటే కనీసం ఒక్క సీటు అయినా జనసేన ఎక్కువగా పొంది ఈ జిల్లాల్లో పోటీ చేస్తే, టీడీపీ – జనసేన కూటమికి పాజిటివ్ ఓటింగ్ వుంటుంది.
కింది స్థాయిలో వున్న పరిస్థితుల్ని విశ్లేషిస్తే,
కాకినాడ పరిధిలో
- పిఠాపురం
- కాకినాడ రూరల్
- కాకినాడ సిటీ
- పెద్దాపురం లేదా జగ్గంపేట నియోజకవర్గాలూ,
అమలాపురం పరిధిలో
- రాజోలు
- అమలాపురం
- కొత్తపేట
- పి.గన్నవరం లేదా ముమ్మిడివరం,
నరసాపురం పరిధిలో
- భీమవరం
- నరసాపురం
- తాడేపల్లి గూడెం
- తణుకు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తుంది.
రాజమండ్రి పరిధి లో
- రాజమండ్రి రూరల్
- రాజానగరం
- కొవ్వూరు లేదా నిడదవోలు నియోజకవర్గాల్లో జనసేన చాలా బలంగా వుంది.
ఈ నియోజకవర్గాల్లో జనసేన విజయం నల్లేరు మీద నడకే.! అలా చూస్తే, ఉమ్మడి తూర్పు గోదావరి లో జనసేన:TDP 10:9 అవుతుంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విషయానికొస్తే, జనసేనకు 7 సీట్లు కేటాయిస్తే, టీడీపీ – జనసేన కూటమికి విజయావకాశాలు అనూహ్యంగా పెరుగుతాయి.
- నరసాపురం
- భీమపరం
- తాడేపల్లి గూడెం
- తణుకు
- కొవ్వూరు
- ఏలూరు
- ఉంగుటూరు నియోజకవర్గాల్లో జనసేనకు విజయావకాశాలు స్పష్టంగా వున్నాయి.
ఉమ్మడి విశాఖ జిల్లాలోనూ జనసేన పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. స్థానికంగా వున్న పరిస్థితుల్ని బట్టి, 6 సీట్లలో జనసేన విజయ ఢంకా మోగించేందుకు వీలుంది. ఆ నియోజకవర్గాలు..
- గాజువాక
- విశాఖ సౌత్
- పెందుర్తి
- అనకాపల్లి
- భీమిలి
- ఎలమంచిలి
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర సహా అనేక అంశాలు ఈ జిల్లాలో జనసేన పార్టీకి అనూహ్యమైన మైలేజ్ తెచ్చిపెట్టాయి.
ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికొస్తే, మొత్తం ఐదు సీట్లలో జనసేన గెలిచే అవకాశం వుంది. వాటిల్లో..
- విజయవాడ వెస్ట్
- కైకలూరు
- పెడన
- మచిలీపట్నం
- అవనిగడ్డ నియోజకవర్గాలున్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేనకు సానుకూలంగా వుంది.
విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల జనసేన ఖాతాలో పడే అవకాశం వుంది.
గుంటూరు జిల్లా విషయానికొస్తే,
- తెనాలి
- గుంటూరు ఈస్ట్
- సత్తెనపల్లి నియోజకవర్గాలు జనసేన ఖాతాలో పడతాయి.
ప్రకాశం జిల్లాలో
- గిద్దలూరు
- దర్శి నియోజకవర్గాలు జనసేనకి పూర్తి అనుకూలం.
నెల్లూరు జిల్లాలో నెల్లూరు సిటీ/రూరల్ లేదా జిల్లాలో ఎక్కడైనా ఒక సీటు జనసేనకి కేటాయిస్తే, జనసేన ఆ సీటుని గెలవడంతోపాటు, కూటమికి అడ్వాంటేజ్ అవుతుంది.
చిత్తూరు జిల్లాలో తిరుపతి, చిత్తూరు నియోజకవర్గాల్లో జనసేనకి మంచి పట్టు వుంది.
అనంతపురం జిల్లాలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జనసేన గెలిచేందుకు అవకాశాలెక్కువ.
కడప జిల్లాలో రాజంపేట నియోజకవర్గం జనసేనకు అనుకూలం. కింది స్థాయిలో క్యాడర్ ఇక్కడ బలంగా వుంది జనసేన పార్టీకి.
కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ, బనగానపల్లి నియోజకవర్గాల్లో జనసేన పార్టీకి అడ్వాంటేజ్ వుంది.
అడ్వాంటేజ్, అవకాశం, సానుకూలతలు.. ఇవన్నీ ఇంకా టిక్కెట్లు ఖాయం కాక ముందున్న పరిస్థితులు. అయితే, టీడీపీ నిర్వహిస్తున్న అంతర్గత సర్వేల్లోనూ ఇదే విషయం నిరూపితమవుతోందిట. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జనసేన రానున్న రోజుల్లో ఇంకాస్త పుంజుకునేందుకు వీలుంది.
ఎలా చూసినా, జనసేన పార్టీకి 70కి పైగా సీట్లలో స్ట్రాంగ్ హోల్డ్ కనిపించొచ్చు. ఆ స్థాయిలో జనసేనకు టీడీపీ పొత్తులో భాగంగా సీట్లు కేటాయించగలిగితే.. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయ్యేందుకు అవకాశాలు సుస్పష్టం.
ఖచ్చితంగా గెలిచే 42 సీట్లకు అదనంగా మరో ముప్ఫయ్ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తోంది. ఆ ముప్ఫయ్కి పైగా సీట్లలో జనసేన క్యాడర్ పూర్తి ఉత్సాహంతో కనిపిస్తోంది. పైన చెప్పుకున్న 42 నియోజకవర్గాలకు అనుబంధంగానే ఈ 30కి పైగా నియోజకవర్గాలూ వున్నట్లు తెలుస్తోంది. ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే.. అన్న కోణంలో దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ క్యాడర్ సమాయత్తమయిన దరిమిలా, పోటీ చేసే సీట్ల విషయమై టీడీపీని డిమాండ్ చేసే పొజిషన్లో జనసేన నిలబడింది.
అదే సమయంలో, చావో రేవో అన్న పరిస్థితి వుంది గనుక, టీడీపీ ‘సజావుగా ఓటు ట్రాన్స్ఫర్’ ఇరు పార్టీల మధ్యా జరిగేలా, జనసేన అడిగినన్ని సీట్లు ఇవ్వక తప్పకపోవచ్చు. 50 ప్లస్ సీట్లలో జనసేన విజయ ఢంకా మోగించగలిగితే, ముఖ్యమంత్రి పదవి విషయమై డిమాండ్ చేయడానికీ జనసేన పార్టీకి ఆస్కారం ఏర్పడుుతందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.
చివరగా.. వెయ్యి, పదిహేను వందలు.. అంతకంటే తక్కువ.. వంద, రెండొందల ఓట్ల తేడాతో గెలిచే అవకాశం వున్న సీట్లను పరిగణనలోకి తీసుకుంటే, జనసేన ఖచ్చితంగా గెలిచే నియోజకవర్గాల సంఖ్య (పొత్తులో భాగంగా) 60 నుంచి 65 పైనే వుండొచ్చునట.!