Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరో అరుదైన ఘనతను గౌరవాన్ని దక్కించుకున్నారు. చెన్నైలోని వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు రామ్ చరణ్. కళా రంగానికి ఆయన చేస్తున్న సేవలకుగానూ డాక్టరేట్ గౌరవాన్ని అందిస్తున్నట్టు తెలిసింది. ఈమేరకు ఏప్రిల్ 13న చెన్నైలోని వేల్స్ యూనివర్శిటీలో జరుగనున్న స్నాతకోత్సవానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వార్తతో మెగాభిమానులు, రామ్ చరణ్ అభిమానుల్లో సంతోషం నెలకొంది. గతంలో చిరంజీవి (Chiranjeevi) ఆంధ్రా యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు.
చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి అనతికాలంలోనే మెగాపవర్ స్టార్ గా ఎదిగారు రామ్ చరణ్. మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలతో ఆయన కెరీర్ పీక్స్ కి వెళ్లింది. రెండో సినిమా మగధీరతోనే సాహసాలు చేసి నిరూపించుకున్నారు. రంగస్థలంలో నటనతో మరే హీరోని ఆ పాత్రలో ఊహించుకోలేనంతగా మెప్పించారు. ఆర్ఆర్ఆర్ తో అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. జపాన్ లో సైతం ఆయనకు వీరాభిమానులు ఏర్పడ్డారు. అమెరికాలోని ప్రముఖ హెచ్ సీఏ అవార్డుల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఫ్యాన్ వార్స్ లేకుండా పోస్టర్లపై కలెక్షన్లు వేయొద్దనేది రామ్ చరణ్ ఆలోచన.
నిత్యం దైవారాధన, నిర్మలమైన మనసు ఆయన సొంతం. చేసే పనిపై శ్రద్ధ ఆయనకు మరో ఆభరణం. ఇవే ఆయన పోషించే పాత్రల్లో మరింత నటన ప్రదర్శించేందుకు దోహదపడుతున్నాయి.తెలుగు సినిమాకు ఐకాన్ గా ఎదుగుతున్న రామ్ చరణ్ కు ఇంతటి గౌరవం సముచితమేననేది అభిమానులు. సినీ ప్రముఖుల మాట. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ లో నటిస్తున్నారు రామ్ చరణ్. త్వరలో బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా రెగ్యులర్ షూటింగ్లో పాల్గొననున్నారు.