‘అసెంబ్లీ సమయంలో అధికారులు అక్కడే ఉండాలి. ఎగ్జిక్యూటివ్ అంటే క్యాబినెట్, సెక్రటేరియట్ కు సంబంధించింది. వారంతా అసెంబ్లీకి హాజరవ్వాలి.. న్యాయపరమైన వ్యవహారాలకు సంబంధించిన వివరాలు అందించాలి. ముఖ్యమంత్రి, మంత్రుల దగ్గర చర్చించి.. వాళ్ల సూచన మేరకు కోర్టులో ఏం ఫైల్ చేయాలో అనుమతులు తీసుకోవాలి. ఇటువంటి సమయంలో మూడు కలిసి ఉంటేనే అనుకూలంగా ఉంటుంది’ అని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్-2 కార్యక్రమంలో ఏపీలో ప్రతిపాదిత మూడు రాజధానుల అంశంపై మాట్లాడారు.
ఇదే కార్యక్రమంలో రాష్ట్ర విభజనపై కూడా ఆయన మాట్లాడుతూ.. ‘మా నాన్న పోయినప్పుడు ఎంత బాధపడ్డానో రాష్ట్ర విభజన జరిగిన సమయంలోనూ అంతే బాధపడ్డా. ఇప్పుడు విచారించాల్సింది ఏమీ లేదు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే. ప్రస్తుతం ఉంటోంది హైదరాబాద్ లోనే. రెండు రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటున్నా. ప్రస్తుతం అంతా సవ్యంగానే ఉంది’ అని అన్నారు. కార్యక్రమంలో మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డి, నటి రాధిక పాల్గొన్నారు.