Chandrababu: ‘ప్రజలు గెలవాలి.. వైసీపీ ఓడి తీరాలి.. రాష్ట్రం నిలబడాలి.. 2024లో జరగబోయేది ఇదే’నని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఉండవల్లిలోని తన నివాసంలో జరిగిన కలలకు రెక్కలు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘కలలకు రెక్కలు అనేది మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించాం. అధికారంలోకి రాగానే మహాశక్తి పేరుతో ఐదు కార్యక్రమాలు చేపడతాం. తల్లికి వందనం పథకంలో ఏడాదికి రూ.15వేలు ఇస్తాం. ఆడపిల్లల్లో నైపుణ్యాభివృద్ధికి సహకరించే పథకమిది. విద్యార్ధినుల ఉన్నత చదువుల కోసం బ్యాంకు రుణాలు అందేలా చేస్తాం. ప్రభుత్వమే వడ్డీ కడుతుంది’.
‘జగన్ పాలనలో జరిగింది విధ్వంసం తప్పితే మరేంలేదు. అమరావతి పూర్తయి.. పరిశ్రమలు వచ్చుంటే.. ఎక్కడో ఉండేవాళ్లం. విద్యా రాజధానిగా ఎదగాల్సిన రాష్ట్రం సర్వనాశనమైంది. పొత్తు పెట్టుకుంది రాష్ట్రాభివృద్ది కోసం. మూడు పార్టీలో ఒకరు ఎక్కువా కాదు.. తక్కువా కాదు. ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకెళ్తున్నాం. ఎన్డీఏతో టీడీపీ పొత్తు ఈనాటిది కాదు. సీట్లు రానివారు పొత్తు ధర్మం పాటించి సహకరించాలి. కష్టపడిన వారందరికీ న్యాయం చేస్తా’నని అన్నారు.