జనసేన పార్టీకి సంబంధించినంతవరకు భీమిలి నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకం.. అన్న భావన నిన్న మొన్నటిదాకా వుండేది. డాక్టర్ సందీప్ పంచకర్ల, భీమిలి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది.
నియోజకవర్గంలో సందీప్ పంచకర్ల చాలా చాలా కష్టపడ్డమాట వాస్తవం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో విశాఖలో పర్యటించినప్పుడు, నానా రకాల కేసులూ ఎదుర్కొన్నారు సందీప్ పంచకర్ల. జనసేన అధినేత మీద కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో జరిగిన గలాటాలో అయితే, రక్తం చిందించారు సందీప్ పంచకర్ల.
మిగతా నియోజకవర్గాల సంగతెలా వున్నా, భీమిలిలో సందీప్ పంచకర్ల పోటీ చేయడం ఖాయం.. గెలిచి, జనసేన తరఫున ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ, మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు ఈ నియోజకవర్గంపై కన్నేశారు.
గంటా శ్రీనివాసరావుని చీపురుపల్లికి పంపించేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చాలా ప్రయత్నాలు చేసినట్లు కనిపించారు. అయితే, గంటా చివరికి భీమిలి వైపే మొగ్గు చూపారు. దాంతో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఇంకో ఆప్షన్ లేకుండా పోయింది.
అదేంటీ, తీసుకున్నవే తక్కువ నియోజకవర్గాలు.. అందులో భీమిలి లాంటి నియోజకవర్గాన్ని టీడీపీకి జనసేన అధినేత ఎలా వదిలేశారన్న ఆవేదన కొందరు జనసైనికుల్లో వ్యక్తమవుతోంది.
సందీప్ పంచకర్ల మాత్రం, జనసేన అధినేత నిర్ణయమే శిరోధార్యం అంటున్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని సుజనా చౌదరికి వదిలేయాల్సి రావడంపైనా జనసైనికుల్లో కొంత ఆందోళన వున్న సంగతి తెలిసిందే. జనసేన నుంచి టిక్కెట్ ఆశించి భంగపడ్డ పోతిన మహేష్, చివరి వరకూ విఫలయత్నం చేశారు.
జనసేన పార్టీ తరఫున బలంగా వాయిస్ వినిపించిన ఇద్దరు నాయకులు పోతిన మహేష్, సందీప్ పంచకర్ల.. అధినేత నిర్ణయాన్ని గౌరవించొచ్చుగాక.. కానీ, ఈ ఇంపాక్ట్ జనసేన మీద గట్టిగానే వుంటుందన్నది నిర్వివాదాంశం. పట్టుమని పాతిక సీట్లు కూడా తీసుకోలేకపోయిన పరిస్థితిని జనసేనాని ఎలా సమర్థించుకుంటారన్న చర్చ తెరపైకొస్తోంది.
అయితే, మారిన రాజకీయ పరిస్థితులు.. పెరిగిపోయిన ఖర్చు.. అన్నిటికీ మించి, వైసీపీని ఎదుర్కొనే క్రమంలో బీజేపీ – టీడీపీతో కలిసి నడవక తప్పని పరిస్థితి.. ఈ కారణాల వల్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తన సోదరుడు నాగబాబుకీ సీటు ఇప్పించుకోలేకపోయిన సంగతి తెలిసిందే.
వైసీపీని ఓడించి, కూటమి అధికారంలోకి వస్తే, నామినేటెడ్ పోస్టులు సహా.. స్థానిక ఎన్నికల్లో మూడోవంతు సీట్లు జనసేనకు దక్కుతాయని జనసేనాని గతంలోనే చెప్పారు. సో, ఇప్పుడు సీట్లు రాని నేతలు, అప్పటిదాకా అధినేత మీద నమ్మకంతో సర్దుకుపోవాల్సిందేనన్నమాట.