చేసుకున్నోడికి చేసుకున్నంత.. అని వెనకటికి ఓ సామెతలాంటిదొకటుంది. తెలంగాణ ఉద్యమంలో గులాబీ పార్టీ వెంట నడిచిన నాయకుల్ని కాదని, ఇతర పార్టీల నుంచి రాత్రికి రాత్రి వచ్చి చేరిన వలస పక్షులకి పెద్ద పీట వేస్తూ వచ్చారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.
మాజీ ముఖ్యమంత్రి.. అంటే, సారుకి కోపమొస్తుంది. అందుకే, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి.. అని కేసీయార్ని సంబోదిస్తోంది.. గులాబీ మీడియా.! ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. కేసీయార్, మాజీ ముఖ్యమంత్రే. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
ఇప్పుడేమో, గులాబీ పార్టీ నుంచి ఒకరొకరుగా ఇతర పార్టీల్లోకి దూకేస్తున్నారు. గతంలో గులాబీ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి నాయకులెలా దూకారో, ఇప్పుడు గులాబీ పార్టీ నుంచి అటువైపు జంప్ చేస్తున్నారంతే. ఎక్కడ అధికారం వుంటే, అక్కడికి రాజకీయ నాయకులు జంప్ చేయడం.. మోడ్రన్ పాలిటిక్స్లో భాగం. ఇందులో ఎవర్నీ తప్పు పట్టడానికి వీల్లేదు.
రాజకీయ పార్టీలు, నాయకులు అమ్ముడుపోతున్న ఈ రోజుల్లో.. ఏదైనా మామూలే.! అసెంబ్లీ ఎన్నికలు జరిగిన జస్ట్ వంద రోజుల్లోనే గులాబీ పార్టీ ఇంతలా అయోమయానికి గురవడమేంటి.? టిక్కెట్లు దక్కించుకున్న నాయకులు, వద్దు మహాప్రభో.. అని పార్టీ నుంచి జంప్ చేసెయ్యడమేంటి.?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు గులాబీ పార్టీ చాలా చాలా తప్పులు చేసింది. ఒక్క ఉప ఎన్నిక కోసం అధికార యంత్రాంగమంతా దిగి, చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన విజయం సాధించే దుస్థితి ఎందుకొచ్చింది.? అంతకు ముందు ఓడిపోయే పరిస్థితిని ఎందుకు కొనితెచ్చుకుంది.?
వున్నపళంగా గులాబీ బాస్, ఆత్మవిమర్శ చేసుకోవాలి. అంతేగానీ, ఇంకా కేసీయార్ తనయుడు కేటీయార్, పార్టీ దూకేస్తున్న నేతల మీద సెటైర్లు వేసుకుంటూ వెళితే ఉపయోగం లేదు. తెలంగాణ ఉద్యమం విజయ తీరాలకు చేరాక, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమేం తప్పులు చేశామన్నది తమను తామే ప్రశ్నించుకోవాలి.
అన్నిటికన్నా ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చి ఏం సాధించారో గులాబీ నాయకత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి. లేనిపక్షంలో, త్వరలో.. అతి త్వరలో.. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం నుంచి గులాబీ పార్టీ అడ్రస్ గల్లంతైపోవడం ఖాయం.
వున్నపళంగా భారత్ రాష్ట్ర సమితి పేరుని తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చెయ్యాలన్న డిమాండ్లు గులాబీ పార్టీలో చాలా చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. లోక్ సభ ఎన్నికల తర్వాత పార్టీ ఏమైనా కొస ఊపిరితో మిగిలితే.. పార్టీ పేరు మార్పు నిర్ణయాన్ని వెంటనే తీసుకోవడం ఉత్తమం.