Ambati Rayudu: టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు( Ambati Rayudu) ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి( YS Jagan mohan Reddy)తో గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. ఆయన వెంట చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్ శ్రీనివాసన్ కుమార్తె రూప రంగనాథ్ కూడా ఉన్నారు. ఇటీవలే సీఎస్కే జట్టు ఐపిఎల్ ట్రోఫీని గెలిచిన విషయం తెలిసిందే. ఆ ట్రోఫీని సీఎం జగన్ కి చూపించి సీఎస్కే టీం సర్ప్రైజ్ ఇచ్చింది. అంతేకాకుండా సీఎస్కే క్రికెటర్ల ఆటోగ్రాఫ్ ఉన్న జెర్సీని జగన్ కి బహుకరించారు. ఏపీలో క్రీడారంగం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన ద్వారా క్రీడలను ప్రోత్సహించడానికి తాను ఆసక్తిగా ఉన్నట్లు సీఎం కి అంబటి రాయుడు వివరించాడు. రాయుడు సూచన ప్రకారం ఏపీ ప్రభుత్వం పటిష్టమైన, సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని సీఎం హామీ ఇచ్చారు.
అయితే, ఇప్పటికే ఐపీఎల్ కి కూడా గుడ్ బై చెప్పిన రాయుడు తన సెకండ్ ఇన్నింగ్స్ రాజకీయాలతో ప్రారంభిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అతడు ఏపీ సీఎంని కలవడం చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది ఎన్నికల దృష్ట్యా ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. రాయుడు స్వస్థలం గుంటూరు జిల్లాలో లేదా విజయవాడలో ఏదో ఒకచోట వచ్చే ఎన్నికల్లో రాయుడికి టికెట్ ఇస్తారని ఊహాగానాలు వెలువడుతున్నాయి. రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ఇప్పటికే రాయుడు పలుమార్లు సంకేతాలు ఇచ్చాడు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన సభలో సీఎం మాట్లాడిన వీడియోని పోస్ట్ చేస్తూ ఏపీ ప్రజలు జగన్ పై నమ్మకం పెట్టుకున్నట్లు ట్వీట్ చేశాడు. ఈ పరిణామాల నేపథ్యంలో రాయుడి చేరిక లాంచనంగానే కనిపిస్తోంది.