డాక్టర్ సుధాకర్.. విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ‘మత్తు డాక్టర్’గా అందరికీ సుపరిచితుడు. ఎప్పుడైతే ప్రభుత్వాసుపత్రుల్లో మాస్క్లు అందుబాటులో లేవనీ, అధికార పార్టీ నేతలే వాటిని కాజేస్తున్నారనీ ఆరోపించారో.. ఆ వెంటనే ఆయన్ని విధుల నుంచి తొలగించింది ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీతో డాక్టర్ సుధాకర్కి లింకులు అంటగట్టడం చూశాం. ఇప్పుడు అదే డాక్టర్, రోడ్డు మీద మద్యం సేవించి నానా హంగామా చేశాడు.
ప్రస్తుతం ఆయన మానసిక స్థితి బాగాలేదంటూ ‘మెంటల్ హాస్పిటల్’కి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇక, ఈ వ్యవహారానికి సంబంధించి రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. డాక్టర్ సుధాకర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని బూతులు తిట్టింది వాస్తవం. మద్యం మత్తులో వున్నాడని అధికారులే చెబుతున్న దరిమిలా.. తాగినోడి వాగుడి గురించి ఏం మాట్లాడగలం.?
అయితే, ఇక్కడ పోలీసులు ఏం చేశారన్నదే కీలకం. ‘మేం అసలు లాఠీలతో కొట్టలేదు..’ అని సాక్షాత్తూ ఓ ఉన్నతాధికారి సెలవిచ్చారు. కానీ, వీడియోల్లో స్పష్టంగా ఓ కానిస్టేబుల్, డాక్టర్ సుధాకర్ని లాఠీతో చితకబాదుతున్న వైనం కన్పిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు.
ఇది కాక, చాలా వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. చేతుల్ని కట్టేశారు, రోడ్డు మీద పడేశారు.. ఇష్టమొచ్చినట్లుగా తన్నారు. తన్నినవారిలో పోలీసులతోపాటు, అధికార పార్టీ కార్యకర్తలు కూడా వుండడం గమనార్హం. అమానవీయంగా ప్రవర్తించిన ఓ కానిస్టేబుల్పై చర్యలు తీసుకున్నట్లు పోలీసు శాఖ చెబుతోంటే, అసలు కొట్టలేదని పోలీస్ ఉన్నతాధికారి చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోగలం.?
కొన్నాళ్ళ క్రితం, అమరావతిలో మహిళలపై పోలీస్ ఉన్నతాధికారులు లాఠీలు ఝుళిపించినప్పుడూ ఇదే తరహా బుకాయింపుల్ని చూశాం. న్యాయస్థానం మొట్టికాయలేశాక.. లాఠీల ప్రతాపం కొంత తగ్గింది. పరిస్థితి అదుపు తప్పినప్పుడు పోలీసులు లాఠీలకు పనిచెబితే.. దాన్ని మరీ అంత తీవ్రంగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ, మతి స్థిమితం కోల్పోయాడనీ, మద్యం మత్తులో వున్నాడని పోలీసులే చెబుతూ, డాక్టర్ సుధాకర్ మీద ఎందుకు లాఠీ ఝుళిపించినట్లు.?