మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన హీరోల మీద భలే డైలాగులు రాస్తుంటాడు. హీరోలు తమ మీద తాము సెటైర్లు వేసుకుంటే ఆ కిక్కే వేరప్పా! దాన్నే త్రివిక్రమ్ స్పెషల్గా క్యారీ చేస్తుంటాడు తన సినిమాల్లో. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమాకి ‘అల వైకుంఠపురములో’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకి ‘అ’ సెంటిమెంట్ షరామామూలే. ‘అజ్ఞాతవాసి’, ‘అరవింద సమేత’, అంతకు ముందు ‘అ ఆ’, ‘అత్తారింటికి దారేది..’ ఇలా చాలానే వుంటాయి.
అఫ్కోర్స్, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘జల్సా’ వంటి సినిమాలూ ఆయన కెరీర్లో వున్నాయనుకోండి.. అది వేరే సంగతి. ఇక, ‘అల వైకుంఠపురములో’ విషయానికొస్తే, స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ఓ గ్లింప్స్ని వదిలారు చిత్ర దర్శక నిర్మాతలు. ఇందులో అల్లు అర్జున్ తన మీద తానే సెటైర్ వేసుకున్నాడు.
‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ పరాజయంతో అల్లు అర్జున్ చాలా టైమ్ తీసుకున్నాడు తన తదుపరి సినిమా విషయమై. ఆ గ్యాప్ గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ భలే సెటైర్ పేల్చాడు ‘అల వైకుంఠపురములో’. ‘ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్..’ అని మురళీ శర్మ అడిగితే, దానికి సమాధానంగా ‘ఇవ్వలేదు, వచ్చింది..’ అంటాడు అల్లు అర్జున్. ఇలాంటి డైలాగ్స్కి బలమైన సన్నివేశాలు రాసుకోవడంలో త్రివిక్రమ్ దిట్ట. ఆ బలమైన సన్నివేశం ఏంటి.? అన్నది సినిమా విడుదలైతేనే తెలుస్తుంది. పూజా హెగ్దే రెండో సారి అల్లు అర్జున్తో ఈ సినిమా కోసం జతకడుతున్న విషయం విదితమే. 2020 సంక్రాంతికి విడుదల కానుంది ‘అల వైకుంఠపురములో’.