సీన్లోకి భారతీయ జనతా పార్టీ రావడంతో, ఆ అభ్యర్థి పోటీ చేయడానికి అస్సలు సుముఖత వ్యక్తం చేయడంలేదట. ఎవరా అభ్యర్థి.? ఏమా కథ.? సరిగ్గా ఎన్నికల ముందర వైసీపీలోకి చేరాడాయన. అంతకు ముందు కూడా వైసీపీతో ఆయనకు అనుబంధం వుంది. అప్పుడూ ఓటమి పాలయ్యారాయన. మొత్తంగా మూడుసార్లు ఓడిపోయిన ట్రాక్ రికార్డు ఆయన సొంతం.
అభ్యర్థులు దొరక్క, ఆయన్ని వైసీపీ వ్యూహాత్మకంగా లాక్కొచ్చింది తమ పార్టీలోకి. ఖర్చు మొత్తం వైసీపీ అధినాయకత్వమే పెట్టుకునేలా ఒప్పందమూ కుదిరింది. ప్రచార వ్యవహారాలన్నిటినీ ఐ-ప్యాక్ టీమ్ చూసుకుంటుందని సదరు అభ్యర్థికి వైసీపీ అధినాయకత్వం భరోసా కూడా ఇచ్చిందట.
గోదావరి జిల్లాల్లోని ఓ కీలక నియోజకవర్గం నుంచి ఆయన వైసీపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. వాస్తవానికి జనసేనలో చేరాలని తొలుత అనుకున్నారాయన. టీడీపీ వీడే క్రమంలో మల్లగుల్లాలు పడ్డారు కూడా. టీడీపీని వీడకుండా వుండి వుంటే బావుండేదని ఇప్పుడు గింజుకుంటున్నారట.
సిట్టింగ్ ఎంపీ చేతులెత్తేయడంతో, సదరు నాయకుడ్ని వైసీపీ అధినాయకత్వం లాక్కొచ్చింది. కానీ, ఇప్పుడేమో సీన్ రివర్స్ అయ్యేలా వుంది. ‘నా వల్ల కాదు.. నేను పోటీలో వుండలేను..’ అని ఆయన తెగేసి చెబుతున్నారట. సర్వేలేవీ అనుకూలంగా కనిపించకపోవడంతో, నాలుగోసారి ఓటమి.. అన్న ఆలోచననే ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు.
నిజానికి, చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి ఇదే పరిస్థితి వుంది. అందుకేనేమో, టిక్కెట్లు దక్కించుకున్న నేతలూ పార్టీలు మారిపోతున్నారు. దాంతో, నమ్మకస్తుల్ని బలవంతంగా పోటీలో నిలబెడుతున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాజ్యసభ సభ్యుడ్ని తీసుకెళ్ళి, లోక్ సభకు పోటీ చేయమని చెప్పడం కూడా ఇందులో భాగమే.