‘కొంగుపట్టి అడుగుతున్నా.. న్యాయం చేయండి..’ అంటూ కంటతడి పెడుతున్నారు కడప లోక్ సభ నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. సోదరి సునీతా రెడ్డితో కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలు కడప ఓటర్లను.. అందునా, మహిళా ఓటర్లను కట్టి పడేస్తున్నాయ్.!
మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె సునీతా రెడ్డి చేస్తున్న న్యాయ పోరాటాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు వైఎస్ షర్మిల. గతంలో అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోసం షర్మిల, సునీతా రెడ్డి పని చేశారు.. అది 2019 ఎన్నికల నాటి పరిస్థితి.
ఇప్పుడేమో, ఆ వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా షర్మిల, సునీతా రెడ్డి నినదిస్తుండడం గమనార్హం. వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారంతో వైసీపీ గ్రాఫ్ కడప లోక్ సభ నియోజకవర్గంలో అనూహ్యంగా పడిపోతోంది. ‘అబ్బే, అంతా బాగానే వుంది..’ అని వైసీపీ బుకాయిస్తున్నా, వైసీపీ సంప్రదాయ ఓటుకి కడప లోక్ సభ నియోజకవర్గంలో బాగానే గండి పడుతోంది.
ముక్కోణపు పోటీ కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలో గట్టిగానే వుండబోతోందన్నది తాజా అంచనాల సారాంశం. కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలో వున్న అసెంబ్లీ నియోజకవర్గాలన్నిటిలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి. వైఎస్ షర్మిల రాజకీయం, వైసీపీకి కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనే కాక, రాష్ట్ర వ్యాప్తంగా గొడ్డలిపెట్టులా తయారైంది.
వైఎస్ షర్మిల, ఎన్ని ఓట్లను తమ పార్టీ నుంచి చీల్చుకుపోతుందో అర్థం కాక వైసీపీ నేతలు తలపట్టుక్కూర్చుంటున్నారు. డ్యామేజ్ అయితే వీర లెవల్లో జరుగుతోందన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.