వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత పరిపాలన విషయంలో కొంత వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తూ ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. జగన్ తీసుకొచ్చిన పధకాలు ప్రజలకు చేరువౌతున్నాయి. పధకాలు ఉచితమే కావొచ్చు. ఇలా ఉచిత పధకాల వలన జగన్ కు రాష్ట్రంలో పేరు వస్తే రావొచ్చు. కానీ, జాతీయంగా ఫేమస్ కావాలి అంటే చేయాల్సింది ఉచిత పధకాలు కాదు.
అందరికి ఉపయోగపడే విధంగా ఏదైనా చేయాలి. అలా చేసినపుడే చరిత్రలో నిలిచిపోతారు. దేశంలో మహిళలపై అత్యాచారాలు అధికంగా జరుగుతున్నాయి. మహిళలపై హింసలు ఎక్కువౌతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళ హింసకు గురవుతూనే ఉన్నది. దీనిని దృష్టిలో పెట్టుకొని జగన్ ప్రభుత్వం దిశ యాక్ట్ ను తీసుకొచ్చింది. ఏ మహిళ అయినా హింసకు గురైనా, అత్యాచారానికి గురైన, హత్య చేయబడినా… 21 రోజుల్లోనే కేసు పూర్తి చేసి నిందితులకు శిక్షపడేలా చేయాలి.
దానికి అనుగుణంగా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి దిశ యాక్ట్ ను తీసుకొచ్చారు. దీనికి కేంద్రం కూడా సానుకూలంగానే స్పందించింది. ఈ యాక్ట్ పార్లమెంట్ లో ఆమోదం పొందాల్సి ఉన్నది. త్వరలోనే పార్లమెంట్ లో ఈ బిల్లు ఆమోదం పొందుతుంది. ఆ తరువాత చట్టం అవుతుంది. జగన్ సర్కార్ తీసుకొచ్చిన చట్టంపై అన్ని రాష్ట్రాల చూపులు ఉన్నాయి. దిశ చట్టం గురించి తెలుసుకొని, దానిని ఆయా రాష్ట్రాల్లో అమలు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఒడిశా, ఢిల్లీ, మహారాష్ట్ర ప్రభుత్వాలు దిశ చట్టాన్ని వారి రాష్ట్రాల్లో అమలు చేయడానికి సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.