అప్పు చేసి సంక్షేమ కూడు.. ఇదీ ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిపాలనా సూత్రం. ఎక్కడన్నా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తూ, తద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని లేదా దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాల్సి వుంటుంది. ఇది సర్వసాధారణ ఆర్థిక సూత్రం. కానీ, ఆంధ్రపదేశ్ ఇందుకు పూర్తి భిన్నం. అప్పులే అప్పులు.. ఎక్కడ అప్పు దొరికితే అక్కడికి పరిగెత్తడమే. అప్పు దొరికే పరిస్థితి లేకపోతే, ప్రభుత్వ ఆస్తుల్ని అమ్మేయడం.
కారణం ఏదైనా కావొచ్చు.. రాష్ట్రం అయినా, దేశం అయినా మితిమీరి అప్పులు చేసేస్తే.. నష్టపోయేది ప్రజలే. చంద్రబాబు హయాంలోనూ రికార్డు స్థాయి అప్పులు జరిగాయి.. ఆ రికార్డుల్ని ప్రస్తుత వైఎస్ జగన్ సర్కార్ బద్దలుగొట్టేస్తోంది. ప్రతి నెలా అప్పు చేయకపోతే, రాష్ట్రానికి తెల్లారే పరిస్థితి లేదని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి నెలా మొదటి తారీఖున.. అప్పుల గురించిన చర్చే మీడియాలో జరుగుతోంది. ‘మేం మంచి పనుల కోసమే అప్పులు చేస్తున్నాం.. అందుకు గర్వపడుతున్నాం..’ అని ఆర్థిక మంత్రి చెబుతున్నారు. కానీ, ఆ మంచి పనులు సత్ఫలితాల్నివ్వాలి కదా.. ఓట్లు రాల్చితే అది రాజకీయ పార్టీకి లాభం తప్ప, సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రానికేంటి లాభం.? రాష్ట్రమెలా పోతే మాకేంటి.? మాక్కావాల్సింది మా పార్టీ బావుండాలంతే.. అనుకోవడం సబబా.? అన్న ప్రశ్న ప్రజాస్వామ్యవాదుల నుంచి దూసుకొస్తోంది.
రాష్ట్రం ముందూ వెనుకా చూసుకోకుండా చేస్తున్న అప్పుల నేపథ్యంలో కేంద్రం స్పందించింది. పదిహేనో ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం నికర రుణ పరిమితిని నిర్దేశించిన కేంద్రం, దానికి లోబడి మాత్రమే అప్పులు చేయాలని స్పష్టం చేసింది. 42,472 కోట్లుగా దీన్ని నిర్ణయించింది కేంద్రం. అన్ని రకాల అప్పులూ ఈ పరిధిలోకే రావాల్సి వుంటుంది. ఆంధ్రపదేశ్ ఆర్థిక శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ నాలుగు పేజీల సమగ్ర లేఖ రాయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యింది. 2017-18 నుంచి 2021-22 వరకు మొత్తం లెక్కల్ని తమ ముందుంచాలని కూడా కేంద్ర ఆర్థిక శాఖ, రాష్ట్ర ఆర్థిక శాఖను ఆదేశించడం గమనార్హం. మరో ఆసక్తికరమైన విషయమేంటంటే, రుణ గ్యారంటీల వివరాల్ని సైతం తమకు సమర్పించాలని కేంద్రం ఆదేశించడం.
784895 646801There is noticeably a bundle to realize about this. I assume you created specific good points in functions also. 832763