రాజధాని విశాఖ.! ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ.! రెండిట్లో ఏది నిజం.? ఎన్నికల తర్వాత విశాఖ కేంద్రంగా పరిపాలన చేస్తానని వైఎస్ జగన్ చెప్పేసుకున్నారు. గెలిస్తే కదా.? అన్న ప్రశ్నకు వైసీపీ నుంచి సరైన సమాధానమే రావడంలేదు.
ఇంతకీ, కర్నూలు సంగతేమైంది.? అని వైసీపీలోనే అయోమయం కనిపిస్తోంది.! అధినేత ఏదో చెప్పారు, దాన్ని కవర్ చేసుకోవాల్సిన దుస్థితి వైసీపీ శ్రేణులది. విజన్ విశాఖ.. అంటూ ఎన్నికల ముందర వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన పబ్లిసిటీ స్టంట్ బెడిసికొట్టింది.
విశాఖలోనే కాపరం అంటూ.. కొన్ని రోజులుగా, నెలలుగా, సంవత్సరాలుగా ఊదరగొట్టేస్తూ వచ్చారు వైఎస్ జగన్. కాపురానికి.. విశాఖ వెళ్ళేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎందుకు మొహమాటపడుతున్నారు.? ఆయన్ని ఎవరు ఆపుతున్నారు.?
వైసీపీ చెబుతున్నదాన్ని బట్టి, ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని.! రాజ్యాంగంలో రాజధాని గురించి ప్రత్యేక నిర్వచనం ఏమీ లేదు.. అని కూడా వైసీపీ అనడం చూశాం. అలాంటప్పుడు, విశాఖలో వైఎస్ జగన్ కాపురం పెట్టేసుకోవచ్చు కదా.?
నిన్న మొన్నటిదాకా ఏం జరిగిందో అనవసరం.! పోనీ, ఇప్పటికిప్పుడు అయినా విశాఖలో కాపురంపై కీలక నిర్ణయం తీసుకుని, రోజుల వ్యవధిలో విశాఖకు వెళ్ళిపోవచ్చు కదా.? కాదు కాదు, వెళ్ళరుట.! ఎన్నికలయ్యాకే వెళతారట.
వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే.. చెప్పేటోడు వైఎస్ జగన్ అట.. అని విశాఖ వాసులే చర్చించుకుంటున్న పరిస్థితి. అసలంటూ విశాఖ ఎలా రాజధాని అవుతుంది.? ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, అమరావతే ఆంధ్ర ప్రదేశ్ రాజధాని.
ఆ అమరావతి కోసం రైతులు భూములిచ్చారు, దానికి సంబంధించి ఒప్పందాలున్నాయి. దాన్ని ఏమార్చి, శాసన రాజధాని.. అని కొత్త పేరు పెడతామంటే కదురదు. ఓసారి చుక్కెదురయ్యింది.. మూడు రాజధానుల బిల్లు చిరిగిపోయింది. 151 సీట్లు వచ్చినప్పుడే సాధ్యం కాని మూడు రాజధానులు, అరకొర సీట్లతో అధికారంలోకి వస్తే జరుగుతుందా.?
అసలంటూ అధికారం వచ్చే పరిస్థితి లేదు.. పైగా, పదో పాతికో సీట్లు మాత్రమే వస్తాయన్న భయం వైసీపీ శ్రేణుల్లో వుంటే, ఈ రాజధాని పంచాయితీ ఒకటి మళ్ళీ.!