పవర్ షేరింగ్.. పవర్ షేరింగ్.. పవర్ షేరింగ్.! టీడీపీ – జనసేన కూటమికి సంబంధించి సీట్ల పంపకాల కంటే ముందు, ఈ అంశం చుట్టూనే పెద్ద రచ్చ జరిగింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్, న్యూస్ ఛానళ్ళలో చర్చా కార్యక్రమాలూ.. వాట్ నాట్.. ఈ యాగీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
చెరి సగం సీట్లలో టీడీపీ – జనసేన పోటీ చేస్తాయనే ప్రచారం తొలుత జరిగింది. ఆ దిశగా ఇరు పార్టీల అధినేతల మధ్యా చర్చోపరచ్చలూ జరిగిన మాట వాస్తవం. ఏమయ్యిందోగానీ, 24 సీట్లలో పోటీకే జనసేన పార్టీ పరిమితమైంది. బీజేపీ రాకతో, జనసేనకి ఒకటో రెండో అసెంబ్లీ సీట్లు తగ్గొచ్చంటూ కొత్త విశ్లేషణలూ మొదలయ్యాయి.
కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం 98 శాతం స్ట్రైక్ రేట్ అంటున్నారు.! ఎన్ని చోట్ల పోటీ చేశామన్నది కాదు ముఖ్యం, పోటీ చేసిన సీట్లలో ఎన్ని గెలిచామన్నదే ముఖ్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు చేస్తోన్న హితోపదేశం తాలూకు సారాంశం. అదీ నిజమే.!
వ్యూహం నాయకుడికి వదిలెయ్యమని జనసేన అధినాయకత్వం పదే పదే పార్టీ శ్రేణులకు సూచిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలయ్యాక, గెలిచిన సీట్లను బట్టి.. మళ్ళీ చర్చలుంటాయ్. అప్పుడు కదా, పవర్ షేరింగ్ అంశం ప్రస్తావనకు వచ్చేది.?
2014 ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు, బీజేపీ గెలిచింది చాలా తక్కువ సీట్లు. కానీ, ఆ పార్టీ శాసన సభ్యులకు మంత్రులుగా అవకాశమిచ్చింది టీడీపీ. కేంద్రంలో టీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు, మంత్రులుగా పని చేశారు.
రేప్పొద్దున్న టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి ఏపీలో విజయం సాధిస్తే, ఎన్డీయే దేశంలో మళ్ళీ అధికార పీఠమెక్కితే.. అప్పుడూ మంత్రి పదవుల పంపకాలుంటాయ్.. కేంద్రంలో, రాష్ట్రంలో.! పదవులు పంపకం, పవర్ షేరింగ్.. రెండూ ఒకటి కాదు. కానీ, పవర్ షేరింగ్ ఇవ్వక తప్పని పరిస్థితి చంద్రబాబుకి ఏర్పడితే.! ఏర్పడుతుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.! చూద్దాం ఏం జరుగుతుందో.!
Good Info