యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. సొంత పార్టీ తనను దూరంగా పెడుతున్న వేళ అత్యంత వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారాయన. కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’ అనే పేరుతో రిజిస్టర్ అయినా, ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’ అనే పేరు ప్రచారంలో వుంది. దీన్ని ‘వైఎస్సార్సీపీ’ అని కూడా అంటున్నాం.
అయితే, పార్టీ తరఫున ఓ ఎంపీకి షోకాజ్ నోటీస్ ఇచ్చే క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయిన పేరునే వాడాల్సి వుంటుందన్న కనీస విజ్ఞతను వైసీపీ విస్మరించడం ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి బాగా కలిసొచ్చినట్లే కన్పిస్తోంది. తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీస్ ఇచ్చారనీ, తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచాననీ, ఈ నేపథ్యంలో పార్టీ తరఫున తనపై తదుపరి చర్యలు లేకుండా ఆదేశాలు ఇవ్వాలని న్యాయస్థానాన్ని రఘురామకృష్ణరాజు ఆశ్రయించారు.
వైసీపీ ఎంపీలు ఈ రోజు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్ళి లోక్సభ స్పీకర్కి రఘురామకృష్ణరాజుపై ఫిర్యాదు చేయాలనుకుంటున్న తరుణంలో, ఆయన ‘న్యాయ పోరాటానికి’ దిగడం వైసీపీ శ్రేణుల్ని షాక్కి గురిచేసిందన్నది నిర్వివాదాంశం. ‘మా పార్టీ ఎంపీలు పనిగట్టుకుని ఢిల్లీకి వెళ్ళి స్పీకర్కి నా మీద ఫిర్యాదు చేసినా, ఆ తర్వాత నా వాదన కూడా విన్పించే అవకాశం వుంటుంది. వాళ్ళనుకుంటున్నట్లు ఏమీ జరగదు..’ అని ఇప్పటికే రఘురామకృష్ణరాజు ధీమా వ్యక్తం చేసిన విషయం విదితమే. ఇప్పుడీ ‘న్యాయ పోరాటం’ ద్వారా ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ’కి దిమ్మ తిరిగే షాక్ తగలబోతోందన్నది రాజకీయ పరిశీలకుల వాదనగా కన్పిస్తోంది.
కాగా, ‘అన్న వైఎస్సార్ కాంగ్రెస్’ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర మరో పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచే రిజిస్టర్ అయ్యింది. ఆ పార్టీ అధినేత కూడా ఈ వ్యవహారంపై సీరియస్గానే వున్నారు. ‘విజయసాయిరెడ్డి అత్యుత్సాహం పార్టీ గుర్తింపు రద్దయ్యేదాకా వెళ్ళేలా వుంది..’ అని ఓ సందర్భంలో రఘురామకృష్ణరాజు చెప్పుకొచ్చారు. అదే నిజమవుతుందా.? రఘురామకృష్ణరాజు ఎపిసోడ్లో వైసీపీ చాలా ‘కాస్ట్లీ మిస్టేక్’ చేసేస్తోందా.? వేచి చూడాల్సిందే.
51954 86842Glad to be one of several visitants on this remarkable internet web site : D. 46566