విశాఖపట్నంలో గ్యాస్ లీక్ వ్యవహారానికి సంబంధించి పాప పరిహారమెంత.? అసలు అది సాధ్యమయ్యే పనేనా.? కానే కాదంటున్నారు బాధితులు, రాజకీయ విశ్లేషకులు. నిజమే, ప్రాణానికి ‘వెల’ కట్టగల సమర్థత ఈ భూమ్మీద ఎవరికీ లేదు. కానీ, పోయిన ప్రాణాన్ని తెచ్చివ్వలేరుగనుక, బాధిత కుటుంబాలకు అందుబాటులో వున్న చట్టాల ప్రకారమో, మానవీయ కోణంలోనో పరిహారమివ్వడం చూస్తున్నాం.
ఎల్జీ పాలిమర్స్ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆఘమేఘాల మీద స్పందించారు.. మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ప్రకటించారు. అంతేనా, బాధిత ప్రాంతంలో సుమారు 15 వేల మందికి కూడా ప్యాకేజీ ప్రకటించారు. వెంటిలేటర్ల మీద వున్నోళ్ళకి, ఓ మోస్తరు అస్వస్థతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి.. ఇలా అందరికీ పరిహారం ప్రకటించేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కానీ, అది సరిపోతుందా.? పరిహారం ప్రకటించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాదన్నది చాలామంది వాదన. ఏ సంస్థ వల్ల అయితే, ఇంతటి దుర్ఘటన జరిగిందో, ఆ సంస్థ నుంచే పరిహారం రాబట్టాలి.
తాజాగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో విచారణ సందర్భంగా, ఎన్జిటి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సంస్థ నుంచి డిపాజిట్ చేయించుకున్న 50 కోట్ల రూపాయల్ని, బాధితులకు పరిహారం కోసం, ఆ ప్రాంతంలో పర్యావరణ హిత కార్యక్రమాల కోసం వినియోగించాలని స్పష్టం చేసింది ఎన్జిటి. అంతే కాదు, చట్టపరమైన అనుమతులు వచ్చాకనే, పరిశ్రమలో కార్యకలాపాలు పునఃప్రారంభించాలనీ, ఈ ఘటనపై వివిధ కమిటీలు విచారణ జరుపుతాయనీ పేర్కొంటూ కేసు తదుపరి విచారణను నవంబర్ మొదటి వారానికి వాయిదా వేసింది.
ప్రభుత్వం పరిహారం ప్రకటించడం, విపక్షాలు ప్రభుత్వం తీరుని ప్రశ్నించడం.. ఇదంతా ఓ ఎత్తు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఇంకో ఎత్తు. నిజమే, లాక్డౌన్ సమయంలో ఫ్యాక్టరీని ఎలా పునఃప్రారంభించారు.? అన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నే. ప్రమాదకర రసాయనం స్టైరీన్ అక్కడెందుకు వుంది.? అన్నది ఇంకో చర్చ. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలున్నాయి. విచారణ సందర్భంగా అన్నీ వెలుగులోకి వస్తాయి.. రావాలి కూడా. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదం ఇంకోటి మళ్ళీ జరగకూడదు.
367210 441083However, what about the bottom line? Are you certain in regards to the supply? 533368