కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఎప్పుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెరపైకి తెచ్చారో, అధికార పార్టీకి వెన్నులో వణుకు మొదలైంది. ఒకరి తర్వాత ఒకరు.. వైసీపీలోని ‘కాపు’ నేతలంతా పోటీ పడి మరీ, జనసేనాని పవన్ కళ్యాణ్పై ఎడా పెడా విమర్శలు చేసేస్తున్నారు. గతంలో పవన్, చంద్రబాబుకి లొంగిపోయారట.. ఇప్పుడూ చంద్రబాబు కనుసన్నల్లోనే పనిచేస్తున్నారట. చంద్రబాబుని అప్పుడెందుకు ప్రశ్నించలేదు.? అని వైసీపీ కాపు నేతలంతా పవన్కళ్యాణ్పై విరుచుకుపడిపోతున్నారు.
టీడీపీ నుంచి వైసీపీలోకి ఈ మధ్యనే చేరిన ఓ ‘కాపు’ ప్రముఖుడు కూడా ఈ రోజు మీడియా ముందుకొచ్చి, పవన్కళ్యాణ్ని ప్రశ్నించేయడం చూస్తోంటే, పవన్కళ్యాణ్ని తిట్టాల్సిందిగా.. వైసీపీలోని ‘కాపు’ నేతలకు ఏ స్థాయిలో ఆదేశాలు అందాయో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఈ రోజు పవన్ కళ్యాణ్ని విమర్శించేందుకు వైసీపీ నుంచి ఇంకో బ్యాచ్ దూసుకొచ్చింది. ఆమంచి కృష్ణమోహన్, తోట త్రిమూర్తులు తదితరులున్నారు ఈ బ్యాచ్లో.
కాపు నేస్తం, కాపు కార్పొరేషన్, కాపు రిజర్వేషన్ అంశాలపై జనసేన అధినేత పవన్కళ్యాణ్, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఆయన ఓ ప్రెస్నోట్ని మాత్రమే విడుదల చేశారు. ప్రెస్నోట్కే అధికార పార్టీ ఇంతలా అదిరిపడాలా.? ఇక, పవన్ కళ్యాణ్ గ్రౌండ్లోకి దిగితే, ‘కాపులకు మద్దతుగా బహిరంగ సభ’ లాంటిది ఏమన్నా పెడితే.. ఆ తర్వాత పరిస్థితులెలా వుంటాయి.? ఇప్పుడు ఇదే అంశం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
‘అసలు పవన్ కళ్యాణ్ని ఎందుకు తిడుతున్నారో అర్థం కావడంలేదు. అప్పుడు టీడీపీ.. ఇప్పుడు వైసీపీ.. రెండు పార్టీలూ కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్నాయి. చంద్రబాబు కనుసన్నల్లో కొందరు నేతలు చెంచాగిరీ చేస్తే, అంతకు మించిన చెంచాగిరీ వైఎస్ జగన్ కనుసన్నల్లో సోకాల్డ్ కాపు నేతలు చేస్తున్నారు..’ అంటూ సోషల్ మీడియా వేదికగా కాపు సామాజిక వర్గానికి చెందినవారు తమ అభిప్రాయాల్ని కుండబద్దలుగొట్టేస్తున్నారు.
అసలే ఆంధ్రప్రదేశ్ అనగానే అందరికీ ‘కులాల కుంపటి’ అనే భావన కలుగుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో కులాల కుంపట్లను రాజకీయ పార్టీలు రాజేస్తుంటాయి. కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఓ అంశంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తే, కాపు సామాజిక వర్గ నేతలతోనే పవన్కళ్యాణ్ని తిట్టించడమా.? అసలు సమస్య ఏంటి.? జనసేన సంధించిన ప్రశ్నలకు సమాధానమేది.? ప్రశ్నకు సమాధానమిస్తే.. సమస్య సద్దుమణిగే అవకాశముంటుంది. సమస్యను దాటవేసి, అడ్డగోలు విమర్శలకు తెరలేపితే.. ఆ సమస్య ముదిరి పాకాన పడుతుందన్న కనీస విజ్ఞతను అధికార పార్టీ విస్మరిస్తే ఎలా.? అన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.