తెరాస పార్టీ పురపాలక ఎన్నికల్లో తిరుగులేకుండా దూసుకుపోతున్నది. ఇప్పటికే సింహభాగం మున్సిపాలిటీలను గెలుచుకున్న తెరాస పార్టీ సరిలేరు నీకెవ్వరు అంటూ పాటపాడుకుంటూ కారులో షికారు చేస్తున్నారు. పార్టీ భారీ విజయంతో కేడర్ తో పాటు కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, తెరాస పార్టీకి ఈ ఎన్నికల్లో రెండు ఎదురు దెబ్బలు తగిలాయి. అందులో ఒకటి జూపల్లి కృష్ణారావు కొట్టిన దెబ్బ.
కొల్హాపూర్, ఐజా మున్సిపాలిటీల్లో జూపల్లి నిలబెట్టిన అభ్యర్థులు విజయపధంలో దూసుకుపోతున్నారు. జూపల్లి అభ్యర్థులు దూసుకుపోతుండటం కారుకు ఇబ్బందిగా మారింది. సొంతపార్టీలోనే అసమ్మతి వర్గం తోడుకావడంతో ఎలాగైనా దానిని అడ్డుకోవాలని కెసిఆర్ చూస్తున్నారు. ఈ విషయం ముందుగానే పసిగట్టిన జూపల్లి, అభ్యర్థులను గోవాకు షిఫ్ట్ చేశారు. దీంతో రిసార్డ్ రాజకీయాలు మొదలయ్యాయి. కొల్హాపూర్, ఐజా మున్సిపాలిటీలను కారు చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ మున్సిపాలిటీల్లో జూపల్లి తన హవా చాటుతుండటంతో కారు ఆలోచనలో పడింది.
ఇక రెండో దెబ్బ ఏమంటే కేటీఆర్ సొంత నియోజక వర్గం, సిరిసిల్ల మున్సిపాలిటీలో పదిమంది స్వతంత్రులు విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఇది కేటీఆర్ కు ఇబ్బంది కలిగించే అంశం అని చెప్పాలి. నిజామాబాద్ లో అక్కను గెలిపించుకోలేకపోయిన కేటీఆర్, ఇప్పుడు సిరిసిల్ల మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థులను కూడా గెలిపించుకోలేకపోతున్నారు. కెసిఆర్ వారసుడిగా, భవిష్యత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా చెప్పుకుంటున్న కేటీఆర్ కు ఇది ఎదురుదెబ్బ అని చెప్పాలి. మరి దీనిని పార్టీ ఎలా తీసుకుంటుందో చూద్దాం.