అసలేం జరుగుతోంది పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో.? వైసీపీ శ్రేణుల్లో నిస్తేజానికి కారణమేంటి.? 2019 ఎన్నికల నాటి పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. పులివెందులో వైఎస్ కుటుంబం ఇప్పుడు కలిసి లేదు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలోనే జగన్ వర్సెస్ షర్మిల.. అనే పొలిటికల్ ఫైట్ నడుస్తోంది.
పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ జగన్ పోటీ చేస్తోంటే, కడప లోక్ సభ నియోజకవర్గానికి షర్మిల పోటీ చేస్తున్నారు. ఇద్దరూ వేర్వేరు పార్టీల నుంచి తలపడుతున్నారు. షర్మిల తరఫున వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఎన్నికల ప్రచారం చేస్తుండడం గమనార్హం.
షర్మిల కాంగ్రెస్ నుంచి కడప లోక్ సభ నియోజకవర్గానికి పోటీ చేస్తుండగా, వైసీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. మరోపక్క, పులివెందుల నుంచి జగన్కి పోటీగా వైఎస్ సునీతా రెడ్డి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వాస్తవానికి పులివెందులలో కావొచ్చు, కడప జిల్లాలో కావొచ్చు ఎలక్షనీరింగ్ మొత్తం వైఎస్ వివేకానంద రెడ్డి చూసుకునేవారు వైఎస్ కుటుంబం తరఫున. అలాంటి వివేకానంద హత్య వెనకాల అవినాష్ రెడ్డి హస్తం వుందనీ, ఆ అవినాష్ రెడ్డిని జగన్ కాపాడుతున్నారనీ స్వయంగా షర్మిల, సునీత ఆరోపిస్తుండడం గమనార్హం.
దాంతో, అటు పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలోనూ, మొత్తంగా కడప పార్లమెంటు నియోజకవర్గంలోనూ వైఎస్ అభిమానులు ఒకింత అయోమయానికి గురవుతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు వర్సెస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె.. అన్నట్లుగా వ్యవహారం మారిపోయిందిక్కడ.
షర్మిల గనుక, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులనే ఓటు బ్యాంకుని చీల్చగలిగితే, పులివెందులలో వైఎస్ జగన్, కడపలో వైఎస్ అవినాశ్ రెడ్డి ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోందన్నది ఆయా నియోజకవర్గాల్లో జోరుగా జరుగుతున్న చర్చ. ఇదే నిజమవుతుందా.? అంత తేలికైన విషయం కాదుగానీ, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు..!