అన్నమయ్య జిల్లాలోని కురబలకోట మండలంలోని అంగళ్ళు లో అధికార వైసిపి నేతలు రెచ్చిపోయారు. ప్రాజెక్టుల విధ్వంసం పై యుద్ధభేరిలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu) అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు బ్యానర్లను వైసిపి నేతలు చించేశారు. అడ్డుకున్న టీడీపీ నాయకులను నాయకులపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కొత్తపల్లి ఎంపీటీసీ దేవేంద్ర తో పాటు పలువురు నేతలకు గాయాలయ్యాయి.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు పార్టీల నాయకులను నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే తమపై రాళ్లదాడులు చేస్తున్న వైసిపి నేతలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమయ్యారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి తక్షణమే వైద్యం అందించాలంటూ చంద్రబాబు నాయుడు స్థానిక నాయకులను ఆదేశించారు. ఈ దాడి ఘటనను చంద్రబాబు ఖండించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ..
‘టీడీపీ నాయకులపై దాడులు చేస్తుంటే పోలీసులు మిన్నకుండిపోయారు. డిఎస్పి సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తున్నారు. బాంబులకే భయపడలేదు, రాళ్లదాడికి భయపడతానా?. నేను చిత్తూరు జిల్లాలో పుట్టాను. పులివెందులకే వెళ్ళిన వాడిని. ఇక్కడికి రాలేనా?. పోలీసుల అండతో వైసిపి నాయకులు రెచ్చిపోతున్నారు. మేం ఎవరి జోలికి జోలికి వెళ్ళము. మా జోలికి వస్తే ఊరుకునేది లేదు. పుంగనూరు కి వెళ్తున్నా. అక్కడ పుడింగి సంగతి తేలుస్తా. ఆయన ఎమ్మెల్యే ట్యాగ్ తగిలించుకుని అరాచకాలు చేయిస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలని హెచ్చరిస్తున్నా. ఈ దాడిలో 100% పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. అలాగే కొనసాగితే వైసిపి నేతలను ప్రజలు తరిమి కొడతారు. అందరి లెక్కలు తేల్చే రోజులు ముందున్నాయి’ అని హెచ్చరించారు.