విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మత్తు డాక్టర్గా పనిచేసిన డాక్టర్ సుధాకర్ ఉదంతంపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎనిమిది వారాల్లో మద్యంతర నివేదిక అందించాలని ఈ సందర్భంగా హైకోర్టు, సీబీఐకి సూచించింది. ఆసుపత్రులో మాస్కులు, పీపీఈ కిట్లు అందుబాటులో లేవంటూ సోషల్ మీడియా వేదికగా డాక్టర్ సుధాకర్ ఓ వీడియో విడుదల చేశాక, ఆయన మీద ‘పచ్చ ముద్ర’ వేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే డాక్టర్ సుధాకర్ని ప్రభుత్వం సస్పెండ్ చేయడం కూడా జరిగింది.
ఆ తర్వాత అనూహ్యంగా డాక్టర్ సుధాకర్ తప్పతాగి నడిరోడ్డు మీద నానా యాగీ చేస్తూ కన్పించారు. కొందరు వ్యక్తులు ఆయన్ని చితకబాదడం, పోలీసులు సైతం సుధాకర్పై దాడికి దిగడం తెల్సిన విషయాలే. దళితుడైన ఓ డాక్టర్ విషయంలో ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించిందంటూ వివిధ రాజకీయ పార్టీలు ఆరోపణలు చేశాయి. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన నివేదికపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలీసులు, డాక్టర్ సుధాకర్ విషయంలో వ్యవహరించిన తీరునీ తప్పుపట్టింది.
మొత్తమ్మీద, సీబీఐ విచారణ జరగనుండడంతో డాక్టర్ సుధాకర్కి సంబంధించి కీలక విషయాలు వెలుగు చూసే అవకాశాలున్నాయనీ, ఇది ప్రభుత్వానికి చెంప పెట్టు అని టీడీపీ మహిళా నేత, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అంటున్నారు. ‘దళితుడికి కాకుండా ఇంకెవరికైనా ఇలాంఇ అవమానం జరిగితే ఊరుకుంటారా.? ఓ డాక్టర్ని మద్యం మత్తులో వున్నాడని కూడా చూడకుండా చెతులు వెనక్కి విరిచి కట్టి, మెడ మీద లాఠీతో నొక్కి, లాఠీలతో చితక్కొట్టడం ఎంతవరకు సబబు.? సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన ఇది.. అంటూ వంగలపూడి అనిత సహా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇక, టీడీపీ ఈ ఘటనతో రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తోందన్నది అధికార వైసీపీ వెర్షన్. ఎవరి వెర్షన్ ఎలా వున్నా, పోలీసుల తీరుని హైకోర్టు తప్పు పట్టిన దరిమిలా, ప్రభుత్వ అత్యుత్సాహం ఇక్కడ సుస్పష్టం.. అన్నది రాజకీయ విశ్లేషకుల వాదన.